Congress war room| హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): అంతర్గత కుమ్ములాటలకు నెలవైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లకు మధ్య కొనసాగుతున్న పోరు సోషల్ మీడియా సాక్షిగా మరోసారి బయటపడింది. సీనియర్లను పొమ్మన లేక పొగబెట్టేందుకు పక్కా ప్లాన్ నడుస్తున్నది. సీనియర్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా వారిని మానసికంగా దెబ్బతీసి, పార్టీ నుంచి సాగనంపేందుకు జూనియర్ బ్యాచ్ అమలు చేస్తున్న ప్లాన్ బెడిసికొట్టడంతో సైబర్క్రైం పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అసలు విషయం తెలియగానే కొందరు కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడే గప్చుప్ అయ్యారు. సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఓ కార్యాలయంపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దాడిచేసి మూడు కంప్యూటర్లను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ కార్యాలయంలో దాడిచేసినట్టు మంగళశారం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నట్టు ఉత్తమ్ ఈ నెల 5న హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు, ఎక్కడి నుంచి పోస్టులు పెడుతున్నారన్నదానిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరిపి, మూలాలను గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కార్యాలయంపై పోలీసులు దాడి చేసిన వెంటనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అది యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ యూత్ కాంగ్రెస్ను కొనియాడారని, దాంతో టీఆర్ఎస్ నాయకులు భయపడి తమ కార్యాలయంపై దాడిచేయించారని ఆరోపించారు.
వాస్తవానికి సైబర్క్రైం పోలీసులు ఆ కార్యాలయంపై దాడి చేసినప్పుడు అది కాంగ్రెస్ పార్టీద న్న విషయం తెలియదు. ఐపీ అడ్రస్, లొకేషన్ల ఆధారంగా ఆ కార్యాలయాన్ని గుర్తించి అందులోని కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా రాజేశ్, రాజు, అజయ్ అనే ముగ్గు రు యువకులను అదుపులోకి తీసుకొని విచారించడంతో.. తాము అల్వాల్లో ఉండే యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి ప్రశాంత్ చెప్పినట్టు పోస్టులు పెడతామని, ఆయన ఆదేశాలతోనే ఉత్తమ్పై పోస్టులు పెట్టామని వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురికి నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు.. ప్రశాంత్కు కూడా నోటీసులిచ్చి ఎవరి ప్రోద్బలంతో ఉత్తమ్పై పోస్టులు పెట్టించారన్న విషయాన్ని ఆరా తీయనున్నారు. సోమవారం రాత్రి నానా హంగామా చేసి నోరుజారిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి.. మంగళవారం ఉదయం అసలు విషయం బయటపడగానే నాలుక కరుచుకున్నారు.
ఉత్తమ్ను ట్రోల్ చేసేందుకు ప్రశాంత్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చిరునామాతో సిమ్కార్డును కొనుగోలు చేసిన ప్రశాంత్.. దాని ద్వారా వైఫైతో వాట్సప్ను యాక్టివేట్ చేసి ఆ తర్వాత సిమ్ తీసేసినట్టు బయట పడింది. కేవలం వాట్సాప్కు మాత్రమే సిమ్ను ఉపయోగించి, ఆ నంబర్తోనే ఉత్తమ్ను ట్రోల్ చేసినట్టు తేలింది. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటెయిల్డ్ రిపోర్టు (ఐపీడీఆర్) ఆధారంగా పోలీసులు ప్రశాంత్ లోకేషన్ను గుర్తించి పట్టుకోవడంతో ఆయన కుట్రలు వెలుగులోకి వచ్చాయి.
‘మా పార్టీలోని కొందరు నేతలే ఉద్దేశపూర్వకంగా మాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్ర చారం చేయిస్తున్నారు. మా పరువును డ్యామేజ్ చేస్తున్నారు’ ఇవీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, జగ్గారెడ్డి గత కొన్ని నెలలుగా చేస్తున్న ఆరోపణలు. ఇప్పుడు వారి ఆరోపణలే నిజమని తేలిపోయాయి. ఉత్తమ్కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ ఇంచార్జి ప్రశాంత్ తప్పుడు పోస్టులు పెట్టించినట్టు తేటతెల్లమవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. కానీ, దీని వెనుక కేవలం ప్రశాంత్ మాత్రమే కాకుండా ఇంకా పెద్ద నేతలే ఉన్నారని, ఇదంతా వారే చేయించి ఉంటారని స్వయంగా కాంగ్రెస్ నేతలే అనుమానిస్తున్నారు. వాస్తవానికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో ఉత్తమ్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాష్కీగౌడ్, భట్టి విక్రమార్క లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏమాత్రం పొసగడం లేదు. పార్టీని డ్యామేజ్ చేసేలా వ్యవహరించిన వారితోపాటు వారి వెనుక ఉన్నవారిపై అధిష్టానం చర్యలు తీసుకునే వరకు పోరాడాలని సీనియర్లు భావిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్లో ఉత్తమ్కు పొగపెడుతుందెవరనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి అనతికాలంలోనే ఉన్నత పదవులను పొందిన ఓ నాయకుడు, ఆయన అనుచరులే ఉత్తమ్ను సాగనంపేందుకు భారీ కుట్ర పన్నినట్టు స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ప్రశాంత్ ద్విపాత్రాభినయం చేస్తూ ఉత్తమ్ లాంటి సీనియర్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నట్టు చెప్తున్నారు.