హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం బెంగళూరులో పర్యటించింది. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు అనుసరించిన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఆరుగురు అధికారులు వెళ్లినట్టు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. తెలంగాణ బృందంలో అదనపు సీఈవో లోకేశ్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, పీఎం ఐటీ చిరంజీవి, ఎస్వీఈఈపీ కన్సల్టెంట్ భవానీశంకర్ ఉన్నారు.
వీరు శుక్రవారం కర్ణాటక సీఈవో మనోజ్కుమార్ను, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. కర్ణాటకకు చెందిన నిఘా, దర్యాప్తు సంస్థల ప్రతినిధులతోనూ వారు సమావేశమయ్యారు. ఎన్నికల్లో నగదు, లిక్కర్ ప్రవాహాన్ని ఎలా ఆపాలో అక్కడి పోలీస్, ఎక్సైజ్, ఆదాయ పన్నుల శాఖల అధికారుల ద్వారా తెలుసుకున్నారు.