హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రైతులు, సాగుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) కోసం వ్యవసాయశాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వానకాలం సీజన్పై, ఇతర వ్యవసాయ అంశాలపై చర్చించేందుకు ఏఈవోలు, ఎంఈవోలతో వ్యవసాయశాఖ శనివారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు యాప్ను విడుదలచేశారు. నాలుగైదు నెలల్లో వ్యవసాయశాఖలో అమలు చేయనున్న బృహత్తర అభివృద్ధి కార్యక్రమాల సాధ్యాసాధ్యాలపై ఏఈవోలతో చర్చించి సలహాలు స్వీకరించారు.
వానకాలం సీజన్కు సంబంధించిన విత్తనాలు, ఎరువుల అవసరం, లభ్యతపై, ఏ పంటలు ఎంత సాగవుతాయనే అంశంపై చర్చించారు. రైతులను లాభసాటి పంటల సాగువైపు మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. ముఖ్యంగా పత్తి, కంది వంటి పంటల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు ఏఈవోలకు సూచించారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. పంటల సాగులో నూతన విధానాల అమలు, యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.