Dharani | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో మరో రెవెన్యూ సమస్యకు ధరణి వేదికగా పరిష్కారం లభించనున్నది. ధరణి పోర్టల్లో కొత్తగా నాలుగు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక రెవెన్యూ సమస్యలకు ఇవి పరిష్కారం చూపనున్నాయి.
భూమి రికార్డులు, విస్తీర్ణానికి సంబంధించి రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ఒక ప్రామాణికం. ఒక సర్వే నంబర్లో ఎంత భూమి ఉన్నదో కచ్చితంగా చెప్పే రిజిస్టర్ ఇది. గతంలో రాత పద్ధతిలో భూ రికార్డులో మార్పులు, చేర్పులు చేసేవారు. ఈ సమయంలో కొందరు రెవెన్యూ అధికారులు తప్పుడు పద్ధతిలో కొందరు రైతుల విస్తీర్ణాన్ని ఎక్కువ మొత్తంలో రాసేవారు. దీంతో సర్వే నంబర్లో భూమి పెరగకపోయినా రికార్డుల్లో మాత్రం ఎక్కువ విస్తీర్ణం నమోదు అయ్యేది. అవే రికార్డులు కొన్ని తరాలపాటు కొనసాగాయి. భూ రికార్డుల ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించిన సమయంలో ఆర్ఎస్ఆర్ రికార్డును ప్రామాణికంగా తీసుకొన్నారు. దీంతో గతంలో పెంచిన విస్తీర్ణాన్ని సరిచేసేందుకు అధికారులు ఒకరిద్దరి రైతుల విస్తీర్ణాన్ని తగ్గించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ క్రమంలో కొందరు నిజమైన రైతులకు కూడా రికార్డుల్లో తక్కువ విస్తీర్ణం నమోదైంది. దీంతో ఓ వైపు వారు ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు బీమా వంటి ప్రయోజనాలను నష్టపోవడంతోపాటు అత్యవసర సమయంలో భూమిని అమ్ముకొనే పరిస్థితి కూడా లేకపోయింది. తమకు భూమి ఉన్నా.. రికార్డుల్లో తక్కువగా నమోదు అయిందని సరిచేయాలని రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం ఆయా రికార్డులను సరి చేసేందుకు నిర్ణయం తీసుకొన్నది. ఆర్ఎస్ఆర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులు దరఖాస్తు చేసుకొనేందుకు ట్రాన్సాక్షన్ మాడ్యూల్ (టీఎం-33) కింద అవకాశం కల్పించారు. ఆర్ఎస్ఆర్- సిగ్మా సబ్ డివిజన్లో ఎక్సెంట్-ఎంఎస్ఎన్ అనే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చారు. రైతులు సొంతంగా లేదా సమీప మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులు నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళ్తాయి. ఒకవేళ నిజమైన రైతు నష్టపోయినట్టు గుర్తిస్తే వారి రికార్డులను సరి చేయనున్నారు.
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలవల్ల కొందరికి కొత్త పాసుపుస్తకం జారీ కాలేదు. డిజిటల్ సంతకం పెండింగ్లో ఉండటం, వివాదాల్లో చిక్కుకోవడంవంటి పలు సమస్యల కారణంగా ధరణిలో ఆ రైతుల వివరాలు నమోదు కాలేదు. ఇలాంటి సందర్భంలోనే రైతు మరణిస్తే.. వారి వారసులు ఆ భూమిని తమ పేరు మీదికి బదలాయించుకొనే అవకాశం గతంలో లేదు. దీంతో ఆ భూమి నిషేధిత భూమిగా రికార్డుల్లో కొనసాగుతున్నది. దీన్ని పరిష్కరించేందుకు టీఎం-3 మాడ్యూల్ కింద ఆప్షన్ కల్పించారు. వారసులకు భూమి మార్పిడికి చేసేందుకు, పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు వీలు కల్పించారు.
వృద్ధులు, ఎన్నారైలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారు తమ భూమిని విక్రయించేందుకు మండల కార్యాలయానికి రాలేరు. ప్రస్తుతం ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో అధికారులే రైతు ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ప్రతిసారి ఆఫీసులో రిజిస్ట్రేషన్లన్నీ పక్కనపెట్టి వెళ్లాల్సి వస్తున్నది. కొన్నిసార్లు రైతు ఇంటి వద్ద నెట్వర్క్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి పరిష్కారంగా తమ తరఫున ప్రతినిధికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) కల్పించేందుకు టీఎం-10 మాడ్యూల్లో ఆప్షన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు తమ ప్రతినిధిగా భూమి క్రయవిక్రయాల హక్కును కల్పిస్తూ ఎవరినైనా ఎంపిక చేసుకొని ఎస్పీఏ ఇవ్వవచ్చు.
ఎస్పీఏ పొందినవారు రైతు తరఫున భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ వయా సెల్లర్-ఎస్పీఏ ఆప్షన్ను టీఎం-10 మాడ్యూల్లో కల్పించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆప్షన్లు రైతులు కొంత కాలంగా ఎదుర్కొంటున్న కీలక ఇబ్బందులకు పరిష్కారం చూపుతాయని అధికారులు పేర్కొంటున్నారు.