(కాసాని మహేందర్రెడ్డి / విట్ట చంద్రశేఖర్రెడ్డి) హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ పెద్దమందడి (ఏప్రిల్ 26): ఎనిమిదేండ్ల కిందటి వరకు పల్లెలంటే.. బీళ్లువారిన నేలలు.. మోడువారిన బతుకులు.. తాగునీటికి పాదయాత్రలు.. ఉపాధి కోసం పట్నాలకు వలసలు.. బతిలాడినా అందని ప్రభుత్వ సాయం.. ఎదుగూబొదుగూ లేని జీవితాలు.. ఎక్కడా కనిపించని కనీస వసతులు. కానీ.. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో పల్లె రూపురేఖలు మారిపోయాయి. భూమి తల్లి కడుపు నిండా నీళ్లు.. పచ్చని పొలాలు.. గల్మ ముంగటికే నీళ్లు.. సొంతూరిలోనే కావాల్సినంత ఉపాధి.. అడుగకున్నా ఇంటింటికీ చేరుతున్న ప్రభుత్వ పథకాలు.. కావాల్సినన్ని సౌలత్లు. మొత్తంగా పల్లెలు పునర్జీవం పొందాయి. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలన్నట్టు టీఆర్ఎస్ పాలనలో పల్లెలు పునర్జీవం పొందాయనడానికి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామమే చక్కటి ఉదాహరణ. తెలంగాణకు ముందు ఈ పల్లె దుస్థితి, ఎనిమిదేండ్లలో మారిన పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం.
జారి పడ్డ దావలనే.. సర్రుమని పోతున్నరు
అప్పుడు: ఊరంతా గుంతలు పడిన మట్టి రోడ్లు. మోరీలు లేక మురుగునీరంతా రోడ్ల మీదికి వచ్చి ముక్కుపుటాలదిరే దుర్గంధం. చిన్న వర్షం పడినా రోడ్లు బురదగా మారి వాహనాలు జారి పడిపోయేవి. 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి మట్టి రోడ్డే గతి.
ఇప్పుడు: గ్రామంలో 3 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్లు వేశారు. మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల ఊర్ల వరకు బీటీ రోడ్లు వేశారు. ఒకప్పుడు జారిపడ్డ రోడ్లమీద ఇప్పుడు సర్రున దూసుకుపోతున్నారు. గ్రామంలో 1.2 కిలోమీటర్లు ఓపెన్ డ్రైనేజీ, 0.8 కిలోమీటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. గ్రామానికి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మంజూరైంది.
భూగర్భం నిండా నీళ్లు
అప్పుడు: దొడగుంటపల్లి చుట్టూ ఒక చెరువు (ఊర చెరువు), మూడు కుంటలు (తిరుమలాయ కుంట, గువ్వల కుంట, అనకాయపల్లి కుంట) ఉన్నాయి. ఒకప్పుడు ఇవి తాంబాలాలను తలపించేవి. నీళ్లు నిలువక భూగర్భ జలాలు పెరిగేవికాదు.
ఇప్పుడు: 2014 ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా నియోకవర్గ అభివృద్ధిని మరువలేదు. మిషన్ కాకతీయ కింద నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించారు. పెద్దమందడి మండలానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీటిని తీసుకొచ్చేందుకు 2017లో సీఎం కేసీఆర్ను ఒప్పించి బుద్దారం చెరువు నుంచి పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ను మంజూరు చేయించారు. కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశారు. దీంతో ఊర చెరువుకు జలకళ వచ్చింది. ఫలితంగా గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఒకప్పుడు 600 అడుగులు బోరు వేసినా నీళ్లు పడని చోట.. ఇప్పుడు 200 అడుగుల్లోనే పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి.
55 యాదవ కుటుంబాలకు ‘జీవాల’ కళ
యాదవుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా దొడగుంటపల్లిలోని 55 మందికి యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించారు. వాటిద్వారా యాదవుల ఇండ్లకు ‘జీవాల’ కళ వచ్చింది.
బాల్యవివాహాలు బంద్
ఒకప్పుడు సరైన అవగాహన లేక, చదివించడానికి డబ్బులేక, ఆడపిల్లలు ఎక్కువగా చదివితే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే అపోహ, వలసలు ఎక్కువగా వెళ్లాల్సి రావడం తదితర కారణాలతో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో రూ.లక్షా నూటపదహార్లు ఇస్తుండటంతో వారికి ఇబ్బంది తప్పింది. ఇప్పటివరకు 60 మంది ఆడబిడ్డలను ఈ పథకం ఆదుకున్నది. మైనారిటీ తీరాలనే నిబంధన ఉండటం, మరోవైపు వలసలు బంద్ కావడంతో తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివిస్తున్నారు.
గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ భవనం, గోపాల మిత్ర భవనం, డంపింగ్యార్డు, శ్మశానవాటిక నిర్మాణం అయ్యాయి.
చెరువుతోపాటే బాగుపడ్డ జీవితాలు
అప్పుడు: చెరువు పడావు పడటంతో దానిపై ఆధారపడిన గంగపుత్రుల జీవనాధారం దెబ్బతిన్నది.
ఇప్పుడు: ఊర చెరువు నిండటంతో గంగపుత్రులకు జీవనాధారం లభించింది. చెరువులో వేసేందుకు ప్రభుత్వం 20 వేల చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నది. చేపలను అమ్ముకొనేందుకు తొమ్మిది మంది గంగపుత్రులకు ఒక ఆటో, ఒక బొలేరో వాహనాన్ని ప్రభుత్వం అందించింది. దీంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
గల్మ ముంగటికే నీళ్లు
అప్పుడు: గ్రామంలో 600 ఫీట్లకు పైగా బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. పేరుకు నల్లా కనెక్షన్ ఉన్నా వానకాలంలో తప్ప నీళ్లు రాని దుస్థితి. దీంతో బిందెలు ఎత్తుకొని పొలాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వచ్చేది. మా నీళ్లన్నీ తోడుకుపోతున్నారని కొందరు తిట్టినా భరించాల్సి వచ్చేది.
ఇప్పుడు: మిషన్ భగీరథ కింద గ్రామంలోని 363 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఇంటా గల్మ ముందే సరిపడా తాగునీరు వస్తున్నది.
నాడు ఎడారిలా.. నేడు పచ్చని పండుగలా..
అప్పుడు: భూగర్భ జలాలు లేకపోవడంతో పెద్దగా చెట్లు పెరుగలేదు. గ్రామంలో అక్కడక్కడా మాత్రమే పెద్ద చెట్లు ఉండేవి.
ఇప్పుడు: హరితహారం కింద గ్రామంలో సుమారు 15 వేల మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో మరో రెండువేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామ నర్సరీలో 11 వేల మొక్కలు పెంచుతున్నారు.
ఎవుసం నవ్వింది
అప్పుడు: దొడగుంటపల్లిలో సుమారు 2 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో సగమే సాగుచేసేవారు. వానకాలంలో తప్ప పంటలు వేసేవారు కాదు. అదికూడా మొక్కజొన్న, జొన్న, ఆముదాలు, వేరుశనగ వంటివి వేసేవారు. వరి మహా అయితే 100-200 ఎకరాల్లో సాగయ్యేది. ఊర చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉన్నా, ఎక్కు వ శాతం కంపచెట్లతో పడావు పడి ఉండేవి. దీంతో ఉపాధి కోసం కుటుంబాలే ‘గుంపులు’ కట్టుకొని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లేవారు.
ఇప్పుడు: నీరు పుష్కలంగా ఉండటంతో రెండు పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంట లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమా రు 1,200 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో వేరు శన గ, మిగతా పంటలు 120 ఎకరాల్లో సాగవుతున్నా యి. కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది.
దొడగుంటపల్లి వివరాలు
జనాభా: 1,954
కుటుంబాలు: 363
రైతుబంధు లబ్ధిదారులు: 661 మంది
ఏటా అందుతున్న మొత్తం: రూ.95.41 లక్షలు
రైతుబీమా అర్హులు: 426 మంది
ఇప్పటివరకు ముగ్గురు రైతులు మరణించగా.. రూ.5 లక్షల చొప్పున సాయం అందింది.
గ్రామంలోని 460 బోర్లు, బావులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నది.
గ్రామంలో 177 మందికి పించన్లు వస్తున్నాయి. ఇందులో వృద్ధ్యాప్య పించన్లు 70, దివ్యాంగ పించన్లు 38, వితంతు పించన్లు 61, ఒంటరి మహిళలు 8 మంది ఉన్నారు. మొత్తంగా నెలకు వస్తున్న పించన్ మొత్తం రూ.3.95 లక్షలు.
గ్రామంలో 116 మంది తల్లులకు కేసీఆర్ కిట్లు అందజేశారు.
నాలుగెకరాలున్నా.. పట్నంలో అడ్డాకూలీగా బతికిన
నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. ఎన్ని బోర్లు ఏసినా నీరు పడలే. చేసేదేం లేక ఊరు ఇడిసిపెట్టి పట్నం పోయినం. అడ్డాకూలీగా పనిచేసి కడుపు నింపుకున్నం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి దయతో చెరువు బాగుపడి నీళ్లతో నిండింది. బోర్లల్లకు నీళ్లు వచ్చినయని తెలిసి మళ్లా మా ఊరికి వచ్చినం. నాలుగు ఎకరాల పొలంలో వరి, వేరుశనగ పండిస్తున్నా. మా తరం వాళ్లం చెరువు నిండా నీళ్లు, పచ్చని పొలాలు చూస్తమని అనుకోలేదు. ఇద్దరు సార్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.
– ఈడిమాకుల వెంకటయ్య, రైతు
మమ్మల్ని గొర్రెలే బతికిస్తున్నయి
పనిలేక, పైసలు లేక పస్తులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నయి. కేసీఆర్ సారు మాకు గొర్రెలు ఇస్తనని చెప్పంగనే మస్తు సంతోషపడ్డం. మా ఇంటికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. ఇంకొన్ని గొర్లు తెచ్చుకొని కలిపినం. ఇవే ఇప్పుడు మమ్మల్ని బతికిస్తున్నయి. ఇప్పుడు నాకు గొర్ల మంద ఉన్నది. ఇదే నా కుటుంబం ఆస్తి.
– మన్నెమ్మ బిడ్డ పెండ్లికి ఆదుకున్నడు
మాకు ముగ్గురు బిడ్డలు. ఇద్దరు బిడ్డలకు పెండ్లి చేసేవరికే మస్తు ఇబ్బంది పడ్డం. అప్పులు కూడా అయినయి. చిన్న బిడ్డ పెండ్లి ఎట్లా చేద్దామా అని మస్తు బాధవడ్డం. ఆ సమయానికి సీఎం కేసీఆర్ సారు కల్యాణలక్ష్మి పథకం తెచ్చిండు. ధైర్యంగా మూడో బిడ్డ పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షా నూటపదహార్లు వచ్చినయి. అంతేకాదు.. మా చిన్న బిడ్డకు సర్కార్ దవాఖానల కాన్పు అయ్యింది. కేసీఆర్ కిట్ కింద రూ.13వేలు ఇచ్చిన్రు. సీఎం కేసీఆర్ సార్ సాయాన్ని ఎప్పటికీ మరువం.
– యాదమ్మ, గృహిణి
ఈ రైతు పేరు శ్రీనివాస్ రెడ్డి. దొడగుంటపల్లి వాసి.
పది ఎకరాల ఆసామి. నీళ్లకోసం 10 బోర్లు వేస్తే 9 బోర్లలో చుక్క నీరు రాలేదు. ఒక్కదాంట్లో మాత్రం చారెడన్ని నీళ్లు పడ్డాయి. పంట వేస్తే ఆ నీళ్లు సరిపోవని, పౌల్ట్రీ ఫారం ప్రారంభించారు. అయినా అవి సరిపోలేదు.
అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ పొలం నుంచి నీళ్లు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు చేశాడు. రోజూ నీళ్లు తీసుకొచ్చి పౌల్ట్రీ నడిపించారు. గుంతల రోడ్లలో ట్రాక్టర్ తరుచూ రిపేర్లు కావడంతోపాటు మూడు ట్యాంకులు మార్చాల్సి వచ్చింది. ఈ ఖర్చు భరించలేక ఏకంగా రూ.లక్ష ఖర్చు చేసి అరకిలోమీటర్ దూరంలోని పొలం నుంచి ఫౌల్ట్రీ ఫారం వరకు పైప్లైన్ వేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన కొన్నాళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఊరిలోని చెరువును మిషన్ కాకతీయ కింద బాగు చేసి నీళ్లతో నింపింది. ఇప్పుడు 180 అడుగుల్లోనే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. బోరు పౌల్ట్రీ అవసరాలు తీర్చడంతోపాటు ఏకంగా 10 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.