చివ్వెంల, ఫిబ్రవరి 26 : సాంకేతిక లోపంతో ఆగిపోయిన బస్సును తరలించడానికి వచ్చిన మరో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు బస్సులు దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల శివారులో 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 6 గంటలకు చోటుచేసుకున్నది. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా గుంపుల వద్ద సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. దాంతో బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.
మరమ్మతు చేయడానికి సూర్యాపేటలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రిలీఫ్ బస్సును తీసుకొచ్చి మరమ్మతులు చేపడుతుండగా రిలీఫ్ బస్సులోని బ్యాటరీలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను మళ్లించారు.