Kamareddy | నిజామాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచింది. చేతి వేళ్లు, కాళ్లను ఎలుక కొరకడంతో గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వెంటనే స్పందించి వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ను విచారణకు ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చిన అజయ్ కుమార్ నేరుగా కామారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరిశీలించారు.
ఐసీయూ వార్డులో రోగి చికిత్స పొందుతున్న వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలుక కరిచిన ఆనవాళ్లను, ఎలుకలు ఐసీయూ వార్డులోకి ఎలా వచ్చాయని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటూ సిబ్బందిని హెచ్చరించారు. బాధితుడి భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించి స్థానికంగానే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇందులో ఆయన చెప్పిన మాటలు విస్తూ గొల్పుతున్నాయి.
వారం రోజులుగా బాధితుడు కోమాలోనే ఉన్నారు. స్పృహలో కూడా లేరని చెప్పారు. ఐసీయూ వార్డులోకి ఎలుకలు రావడానికి స్థానికంగా జరుగుతున్న నిర్మాణ పనులు, రోగి బంధువులు తిని పడేసిన అన్నం మెతుకులే కారణమని చెప్పారు. దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యాన్ని రోగులకు ఆపాదిస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఇచ్చిన వివరణకు అందరూ ఆశ్చర్యపోయారు.
నలుగురిపై చర్యలు..
రోగిని ఎలుక కరిచిన ఘటనపై కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించగా.. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి నలుగురిపై చర్యలు తీసుకున్నారు. వైద్యురాలు కావ్య, ఇన్చార్జి జనరల్ మెడిసిన్ వైద్యుడు సంపత్కుమార్, స్టాఫ్నర్స్ మంజులను సస్పెండ్ చేయగా,సూపరింటెండెంట్ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
24 గంటల్లో వైద్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
కామారెడ్డిలో రోగిని ఎలుకలు కరిచిన వ్యవహారంలో డీఎంఈ విభాగ డాక్టర్లను సస్పెండ్ చేయడంపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంటు డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పేషెంట్కు వైద్యం చేయడం వరకే డాక్టర్ల బాధ్యత అని.. దవాఖానలో ఎలుకలు ఉండకుండా చూడటం శానిటేషన్ సిబ్బంది, సంబంధిత అధికారుల బాధ్యత అని ఆదివారం ఓ ప్ర కటనలో పేర్కొన్నారు.
డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న టీచింగ్ వైద్యులంతా సమ్మెకు సిద్ధమవుతారని హెచ్చరించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభు త్వ కళాశాలల్లో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు. 24 గంటల్లో సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ‘చలో డీఎంఈ’ ప్రకటిస్తామని హెచ్చరించారు. గాంధీ దవాఖానలో 9వ తేదీ నుంచి కేఎన్ఆర్ వర్సిటీ తరపున జనరల్ మెడిసిన్ ఎగ్జామినర్గా డ్యూటీలో ఉన్న డాక్టర్ వసంత్ను ఎలా సస్పెండ్ చేస్తారని టీటీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి రావు ప్రశ్నించారు.