కొండాపూర్, మే 16 : జననేంద్రియ అట్రేసియా వ్యాధితో బాధపడుతున్న పసికందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను గురువారం సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ మధుమోహన్రెడ్డి వెల్లడించారు. నాలుగు రోజులుగా పొత్తికడుపు వాపు, వాంతులతో బాధపడుతున్న 45 రోజుల పసికందును వైద్యం కోసం దవాఖానకు తీసుకొచ్చారు. పూర్తి పరీక్షలు నిర్వహించగా.. మూత్ర వ్యవస్థ, వెన్నుముక సమస్యలతో పాటు యోని అట్రేసియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు.
వైద్య బృందం యోని పునర్నిర్మాణంతో పాటు వెనక భాగంలో ఓపెనింగ్ సృష్టించారు. ఐదు గంటలపాటు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ డాక్టర్లు వరలక్ష్మి, జనార్దన్రెడ్డి, రవీందర్రెడ్డి, సంధ్య, హర్షిత పాల్గొన్నారు.