కోరుట్ల, అక్టోబర్ 8: జగిత్యాల జిల్లా కోరుట్లలోని టీఎస్ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.అరకోటి మేరకు నష్టం వాటిల్లింది. కోరుట్ల డిపోకు చెందిన టీఎస్ 21జడ్ 0074 రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ బస్సు ఆదివారం 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కోరుట్ల కొత్త బస్టాండ్కు వచ్చింది.
ప్రయాణికులను దించిన డ్రైవర్ డిపోలోని డీజిల్ బంక్ వద్దకు బస్సును తీసుకెళ్లారు. ఆ సమయంలో బస్సు బ్యాటరీల్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆర్టీసీ సిబ్బంది మరో బస్సు సాయంతో బస్సును బంక్ నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేశారు. మంటలు డీజిల్ బంక్కూ వ్యాపించడంతో పైభాగం పూర్తిగా కాలిపోయింది. మెట్పల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మంటల్లో రాజధాని ఏసీ బస్సు పూర్తిగా దగ్ధమవడంతో సుమారు రూ.50 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు.