నల్లగొండ : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో వట్టిమర్తి స్టేజి వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ సంఘటనలో డ్రైవర్తోపాటు మరో ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్పల్లి సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.