మహబూబాబాద్ : జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామం వద్ద తొర్రూరుకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తొర్రూరులోని నలంద ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం నుంచి పిల్లలను తీసుకొని బయల్దేరింది. ఈ క్రమంలో బొడ్లాడ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది.
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పిల్లలను సరక్షింతంగ ఆ బయటకు తీసుకొచ్చారు. స్వల్పంగా గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో సదరు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని ఫిర్యాదు చేసినా స్కూల్ యాజమాన్యం స్పందించలేదని వాపోయారు.