హైదరాబాద్ : బస్సు డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పెను నష్టం జరిగి ఉండేది. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ప్రైవేటు బస్సు(Private bus) అర్ధరాత్రి సమయంలో సంగారెడ్డి(Sangareddy) జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో ప్రమాదానికి గురైంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి ప్రయాణికులను అలర్ట్ చేశాడు. దీంతో ప్రయాణికులు క్షణాల్లోనే బస్సును ఖాళీ చేశారు. ఆ వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికుల లగేజీలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. ప్రయా ణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.