బంజారాహిల్స్,ఏప్రిల్ 15 : కాలనీలో పార్క్ చేసిన కారులో(Parked car) గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన(Person died) ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్(Banjarahills) రోడ్ నెం 11లోని దావూద్ జంగ్ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ జునాయిద్ ఇర్ఫాన్ అనే వ్యాపారికి చెందిన బెంజ్ కారుకు సంబందించిన మరమ్మతులు రావడంతో దాన్ని ఇంటిముందే పార్క్ చేశాడు. వారంరోజులుగా ఇంటిముందు పార్క్ చేసిన కారులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి (45) కూర్చుని ఉన్నట్లు గుర్తించిన జునాయిద్ ఇర్ఫాన్ అక్కడికి వెళ్లిచూసాడు.
కారులో కూర్చున్న వ్యక్తి అపస్మారస్థితిలో ఉన్నట్లు గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ పిలిపించాడు. అక్కడకు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతడిని పరీక్షించగా మృతి చెందినట్లు తేలింది. దాంతో తన ఇంటి ముందు కారులో గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడంటూ ఇర్ఫాన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.