హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివారులోని హకీంపేట్లో కొత్తగా టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఏర్పాటైంది. దీని నిర్వహణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ట్వీట్టర్ ద్వారా తెలిపారు. పదో తరగతి విద్యార్హతతో మోటర్ మెకానిక్ వెహికిల్, మెకానికల్ డీజిల్ ట్రేడ్లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 8లోపు http//iti.telangana.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న విద్యార్థులకు ఈ నెల 9న వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిషిప్ సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్తును అందించాలనే సంకల్పంతోనే ఈ కళాశాలను ఏర్పాటు చేసినట్టు సజ్జనార్ తెలిపారు. పూర్తి వివరాలకు 9100664452 నంబర్ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. నిరుడు వరంగల్లో ఐటీఐ కాలేజీని ఆర్టీసీ సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే.