కల్లుగీత వృత్తిదారుడికి బతుకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గీతకార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందుతున్నది. అయితే అది రావడంలోనూ తీవ్రజాప్యం నెలకొంటున్నది. రైతుబీమా తరహాలో వారంరోజుల్లోనే పరిహారం ఖాతాల్లో జమ అయ్యేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
Insurance scheme | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘రైతుబీమా’ తరహాలో ‘గీతకార్మికుల బీమా’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతకార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ఆయన మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల బీమా పథకంపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీస్తూ దురదృష్టకర సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందిస్తున్నా.. బాధితులకు పరిహారం అందడంలో ఆలస్యం అవుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతు బీమా తరహాలోనే కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారంలోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను ఆదేశించారు.
తీరనున్న గౌడన్నల కష్టాలు
గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడి మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం.. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా అందిస్తున్నది. అయితే, ఈ ఎక్స్గ్రేషియా పొందేందుకు బాధిత కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఎక్కడో మారుమూల గ్రామంలో సంఘటనా స్థలంలో ఎఫ్ఐఆర్ మొదలుకొని.. సాక్షులు, డెత్ సర్టిఫికెట్, ఇతర పేపర్ వర్క్ మొత్తం ఓ ఫైల్గా సంబంధిత రాష్ట్రశాఖకు చేరేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. చెక్కుల రూపంలో ఇచ్చే పరిహారం డబ్బులను విత్డ్రా చేసుకొనేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబపెద్ద చనిపోయిన బాధ ఒక ఎత్తయితే.. ఆ డబ్బుల కోసం తిరగడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో కొర్రీలేమీ లేకుండా రైతు బీమా తరహాలోనే ‘గీత కార్మికుల బీమా’ను తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేవలం వారం, పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి చెందిన నామినీ అకౌంట్లో రూ.5 లక్షల సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఈ పథకం అమలైతే రాష్ట్రంలోని దాదాపు 2.4 లక్షల గీతకార్మికుల కుటుంబాలకు భరోసా లభించనున్నది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
‘గీతకార్మికుల బీమా’ను తీసుకురావడం సీఎం కేసీఆర్ మరో సాహసోపేత నిర్ణయం. ఇంతమంచి నిర్ణయంతో గీతకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. పింఛన్లు, కల్లు అద్దెలు, బకాయిల మాఫీ చేసి, వైన్స్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించి.. గౌడ కులస్థులను ప్రోత్సహిస్తున్నారు. గౌడన్నల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
-వీ శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
గీతకార్మికుల కుటుంబాలకు భరోసా
‘గీతకార్మికుల బీమా’ నిర్ణయం సంతోషకరం. గీత కార్మిక కుటుంబాలకు భరోసా లభించింది. రూ. 5 లక్షలు నేరుగా అకౌంట్లో జమచేయాలని నిర్ణయించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు.
-పల్లె లక్ష్మణ్గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు