హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ‘కేసీఆర్ జీవబంధు’ అనే కొత్త పథకం అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో సీఎస్ శాంతికుమారితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం బాల్రాజ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు ఐదారు వేల గొర్రెలు వివిధ రకాల ప్రమాదాల కారణంగా చనిపోతున్నాయిని తెలిపారు.
దీంతో పెంపకందారులు నష్టపోకుండా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికే ఈ పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు. గొర్రెల పంపిణీతో పెంపకందారుల జీవితాల్లో వచ్చిన ఆర్థిక, సామాజిక మార్పులపై సమగ్ర అధ్యయనం చేసినట్టు తెలిపారు. జంటనగరాల్లోని మాంసప్రియుల కోసం శుభ్రమైన, నాణ్యమైన గొర్రె మాంసాన్ని అందించాలనే ఉద్దేశంతో ఫెడరషన్ కార్యాలయ ఆవరణలో త్వరలో ‘కేసీఆర్ మటన్ క్యాంటీన్’ను ప్రారంభించి నాణ్యమైన మటన్ బిర్యానీ, బోటి, మటన్ కూరలను అందించనున్నట్టు వివరించారు.