Suicide | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకుమార్తె ఇంట్లోనే ఉరేసుకున్నారు. తల్లి, సోదరి శవాలను చూసి తమ్ముడు తల్లడిల్లిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన మురుగన్, ధనలక్ష్మి దంపతులు కొన్నేండ్ల క్రితం మందమర్రికి వలసొచ్చారు. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఇక అప్పడాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ధనలక్ష్మి(36), ఆమె కుమార్తె జీవని(16) ఉరేసుకున్నారు. వారి కుమారుడు సిద్ధూ ఉదయం లేచి చూసేసరికి తల్లి, అక్క శవాలుగా కనిపించడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. అనంతరం తమ బంధువులకు సమాచారం అందించాడు.
అయితే ప్రతి రోజు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ నిన్న రాత్రి నుంచి ఇంటికి రాకపోవడం, అతడి సెల్ ఫోన్ స్విచ్ఛాప్ కావడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఘటనాస్థలాన్ని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.