హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పేదరికాన్ని పూర్తిగా రూపుమాపే సదాశయంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. లబ్ధిదారులకు అనుభవం, వృత్తి నైపుణ్యం ఉన్న, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే యూనిట్ల ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు మంజూరైన మొత్తం 36,265 యూనిట్లులో 28,970 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని సైతం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రూ.3,100 కోట్లు విడుదల చేసిందని, బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.17,700 కోట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో మొదలు పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, దళితబంధు పథకం సలహాదారు లక్ష్మీరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా ఎండగట్టాల్సిన అవసరం ఉన్నదని కొప్పుల అన్నారు. శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా వారియర్స్కు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో గొప్పగా అభివృద్ధి చేయడాన్ని ప్రపంచ మొత్తం గుర్తించి ప్రశంసిస్తుంటే, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకొంటూ కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా వినియోగంలో ధర్మపురి యువత చాలా చురుకుగా ఉన్నదని పేర్కొన్నారు.