మల్యాల : యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తీర్దిదిద్దుతామని సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించడం పట్ల మల్యాల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సంకల్పానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా ఆలయం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ బుధవారం ముత్యంపేట గ్రామస్థులు కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించారు.
ముత్యంపేట, కొండగట్టు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంటికి ఒకరు చొప్పున సుమారు వెయ్యి మంది మూడు కిలో మీటర్ల వరకు ఘాట్రోడ్గుగుండా కొండపై ఉన్న వై జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ కటౌట్కు పాలాభీషేకం చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయంగా ముడుపులు కట్టారు.
కొండగట్టుకు వందకోట్ల నిధులు మంజూరు చేయడమే కాకుండా దేశంలోనే గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతానని, అవసరమైతే వెయ్యి కోట్లయినా ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కొండగట్టును ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.