రాజన్న సిరిసిల్ల : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య(Committed suicide) చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla) కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ అంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ గూడూరి సాగర్ (28), అదే కాలనీకి చెందిన అనూష అనే అమ్మాయిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత అత్తవారి ఇంట్లోనే నివాసం ఉంటూ జీవనం సాగించాడు. అయితే, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఈ క్రమంలో అనూషను రావాలని కోరగా, ఆమె రాకపోవడంతో, ఆదివారం రాత్రి సమయంలో సాగర్ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. వారంతా రాత్రి సమయంలో నిద్రలో ఉండగా సాగర్ చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.