నిజామాబాద్ క్రైం, ఆగస్టు 21: వ్యాపారం కోసం చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని బలి తీసుకొన్నాయి. అప్పులిచ్చిన వారితోపాటు వ్యాపార భాగస్వాముల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కొత్తకొండ సూర్యప్రకాశ్ (37) గతంలో స్థానికంగా వ్యాపారం నిర్వహించాడు.
అప్పులు కావడంతో భార్య అక్షయ (36), కూతురు ప్రత్యూష (11), కొడుకు అద్వైత్(7)తో కలిసి ఏడేండ్ల క్రితం హైదరాబాద్కు మకాం మార్చాడు. ఓ స్నేహితుడితో కలిసి అక్కడే భూమి కొనుగోలు చేసి వెంచర్ చేశాడు. వెంచర్ కోసం మిత్రులు, బంధువుల నుంచి అప్పులు తీసుకొన్నాడు. అయితే, వెంచర్లో ప్లాట్ల అమ్మకాలు కాకపోవడంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. కొందరు సూర్యప్రకాశ్పై కేసు పెట్టినట్టు సమాచారం. తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యప్రకాశ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.
ఈ నెల 4న నిజామాబాద్లోని హోటల్ కపిలలో గదిని అద్దెకు తీసుకొని భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగర సీఐ కృష్ణ, ఎస్సై సందీప్తో కలిసి హోటల్కు చేరుకొని గది తలుపులు తెరిచి చూడగా.. సూర్యప్రకాశ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఉండగా, అక్షయ, ప్రత్యూష, అద్వైత్ విగత జీవులుగా పడి ఉన్నారు.
ఘటన స్థలిలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొన్నారు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. మరో ఘటనలో అప్పులబాధతో జగిత్యాలకు చెందిన ఆకోజు కృష్ణమూర్తి, భార్య శైలజ, కొడుకు ఆశిత్ (పదో తరగతి), కూతురు గాయత్రి (తొమ్మిదో తరగతి) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.