సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 25: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కాట్నపల్లి పరిధిలోని ఓ రైస్ మిల్లు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లారీని వెనుక నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న టైల్స్ లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
టైల్స్ లోడు లారీలో ఉన్న హర్యానాకు చెందిన డ్రైవర్ ఫరియాజ్ (22) మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. క్లీనర్ ఇంజుమాం బయటకు దూకడంతో గాయాలతో బయటపడ్డాడు. బియ్యం లోడు లారీ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. దాని డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ అనిల్, సుల్తానాబాద్ సీఐ జగదీశ్, ఎస్సైలు విజేందర్, మహేందర్ అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.