Uttam Kumar Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఒక నాయకుడు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకే పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ మారుతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై పలుమార్లు ఉత్తమ్ వివరణ ఇచ్చుకొన్నారు. అయినప్పటికీ ఆ వార్తలు ఆగడం లేదు. దీంతో తాను పార్టీ మారడం లేదని శనివారం మరోసారి ప్రకటన విడుదల చేశారు.
అందులో రేవంత్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ, పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి అంటూ సంబోధించడం గమనార్హం. ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా, యూట్యూబ్ చానళ్లలో తనపై, తన భార్య పద్మావతిపై పదే పదే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తన భార్య పద్మావతి కోదాడనుంచి ఎమ్మెల్యేగా పనిచేశారని, 2018 తర్వాత స్వల్ప తేడాతో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడి ప్రజలకోసం నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. 30 ఏండ్లుగా తాను కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేస్తున్నానని, ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు గెలుపొందానని చెప్పారు. అలాంటి తమపై రెండేండ్లుగా పూర్తిగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలతో నిరంతరం తనను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓ కాంగ్రెస్ నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్ చానెల్లు, మీడియా సంస్థలు తన గురించి, తన భార్య గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రసారం చేయడం తీవ్ర బాధను కలిగించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తప్పుడు కథనాలను తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్పారు.