హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావాన్ని తేల్చేందుకు నిర్వహించాల్సిన జాయింట్ సర్వేకు అనుకూలమైన తేదీలు చెప్పాలని తెలంగాణకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భద్రాచలం ఎస్ఈకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఎస్ఈ గురువారం లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఫలితంగా కిన్నెరసాని, ముర్రేడువాగుల్లో ప్రవాహం స్థిరంగా నిలిచి ఉంటున్నదని, ఆ వాగులు గోదావరిలో సహజరీతిలో కలువలేకపోతున్నాయని, వరద నీటి వల్ల ముంపు ఏర్పడుతున్నదని తెలంగాణ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ముంపు ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఏపీ సైతం జాయింట్ సర్వేకు అంగీకరించింది.