దామరచర్ల : భార్యతో గొడవల కారణంగా ఓ భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నూనావత్ తండాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే దామరచర్ల మండలం నునావత్ తండాలో కిషన్ నాయక్ అనే వ్యక్తికి తన భార్యతో గత కొంతకాలం నుంచి గొడవలు కొనసాగుతున్నాయి. దీంతో గురువారం విబేధాలు తారాస్థాయికి చేరడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన భర్త తన ఇద్దరు కుమారులను తీసుకుని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు కుమారులకు కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చాడు. కాసేపటికే వారిద్దరూ చనిపోయారు. ఆ తర్వాత కిషన్ కూడా చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలను హర్షవర్ధన్(8), అఖిల్(6)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.