ఎమ్మెల్యేల బేరసారాల స్కాంలో పట్టుబడ్డ ముగ్గురు బ్రోకర్ల కాల్డేటా, ల్యాప్టాప్ డేటాను విశ్లేషిస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు, జాతీయ స్థాయి పాత్రికేయులు, కస్టడీలో నిందితులను విచారించిన పోలీసు వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. థ్రిల్లర్ సినిమా స్థాయిలో ఉన్న ప్రత్యేక కథనం నమస్తే తెలంగాణ పాఠకులకు ప్రత్యేకం!
నిగూఢ యుద్ధ ప్రకటన ఒకటి జరిగింది తెలంగాణపై.. నిశ్శబ్దంగా! ఢిల్లీలోని అధికార మందిరాల సాక్షిగాయుద్ధ వ్యూహ రచన చేసారు తెలంగాణపై..నిశ్చలంగా!నిత్యం ధర్మ పన్నాలు వల్లించే అత్యున్నత స్థాయి వ్యక్తులే కుంచిత మనస్కులై అధర్మ యుద్ధానికి సిద్ధమయ్యారు…
నిస్సిగ్గుగా!ఆదర్శాల ప్రజాస్వామ్య రాజకీయమే కాదు; అంతఃపుర దుర్మార్గాల రాచరికం కూడా సిగ్గుపడి చచ్చిపోయే రీతిలో.. దారుణ ద్రోహం ఒకటి జరిగింది తెలంగాణపై…నిర్ద్వంద్వంగా!
దాన్ని కుట్ర అనాలా? కుతంత్రమనాలా? పన్నాగమనాలా? ఈ పదాలేవీ చాలవేమో! అది పాపం. దేవుడు సైతం క్షమించలేని పాపం. కొందర్ని నమ్మి ఈ దేశం చేసుకున్న పాపం.ప్రజాస్వామ్యానికి శాపం!
రానున్న రోజుల్లో భారతదేశం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఒక పంకిలాన్ని పరికించబోతున్నది. ప్రవచిస్తున్న ప్రజాస్వామ్యం ఇదేనా? అని ప్రతి ఒక్కరి కళ్లూ బైర్లుకమ్మే వాస్తవాలను వీక్షించబోతున్నది. నిప్పులాంటి నిజాలను చూసి నిర్ఘాంత పోనున్నది. ఢిల్లీ పీఠాలే దద్దరిల్లే దారుణ దరిద్ర దుర్మార్గమొకటి మెల్లిమెల్లిగా తెరపైకి వస్తున్నది.
తెలంగాణపై ఏం జరిగింది ఢిల్లీ అంతరాలయాల్లో?ఎప్పుడు మొదలైంది ఈ కథ? మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరెవరున్నారు ఇందులో? ఎన్నడూ లేని రీతిలో ప్రధాని మోదీ అడిగి మరీ తెలంగాణ పర్యటన ఎందుకు పెట్టించుకున్నారు? హైదరాబాద్ గడ్డపై నిలబడి ఆయన కొట్టిన బుసల వెనక దాగిన విషమెలాంటిది? హెచ్చరికల రుసరుసకు కారణమైన అసలు భయమెట్టిది? రంగురంగుల బట్టలు ధరించే వ్యక్తుల అసలు రంగు ఏమిటి?
తెలంగాణపై బీజేపీ విష కుట్రకు
బీజం పడిన రోజు.. జూలై 2. రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హా హైదరాబాద్ వచ్చిన రోజు.
ఆ సభావేదిక పైనుంచి కేసీఆర్ ప్రధాని మోదీని కడిగేసిన తీరు! కేసీఆర్ జోరు బీజేపీని ఎలా భయపెట్టింది? తదనంతర పరిణామాలు ఎలాసాగాయి?
‘పీఎం ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్’!
బ్రోకర్లను ముగ్గులోకి దించడానికి రోహిత్.. ‘మిమ్మల్ని ఎలా నమ్మేది? బీజేపీతో మీకున్న సంబంధాలేమిటి?’ అని ఆరా తీశారు. ఇదే విషయాన్ని రామచంద్రభారతికి సింహయాజి చేరవేశారు. సెప్టెంబరు 22న సింహయాజికి రామచంద్రభారతి ఇలా మెసేజ్ పంపారు. ‘పీఎం ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్.’ దీనర్థం.. దీనిలో ప్రధానమంత్రి స్వయంగా పాలుపంచుకుంటున్నారని!
– సెప్టెంబరు 22న కాల్ డేటాలో ఉన్న మేసేజ్
‘టగ్ ఆఫ్ వార్.. ఒక్కరినైనా చేర్పించు’..
అక్టోబర్ 16న బ్రోకర్లు రోహిత్రెడ్డికి ఇలా మెసేజ్ చేశారు. ‘టగ్ ఆఫ్ వార్. ప్లీజ్.. కనీసం ఒక్కరినైనా చేర్పించు’ అని పదేపదే అడిగారు. అక్టోబరు 31న మునుగోడులో పార్టీ అధ్యక్షుడు నడ్డా జరిపే సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని, తదుపరి పన్నాగాన్ని అమలు చేసేందుకే బ్రోకర్లు ఇలా ఒత్తిడి తెచ్చారు.
– అక్టోబర్ 16న కాల్ డేటాలో ఉన్న మేసేజ్
ఆర్సీబీ సామాన్యుడు కాదు..
ప్రధానితో సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు నలుగురు అధికారులు, కేంద్ర హోంశాఖలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కూడా తనతో నిరంతర సంపర్కంలో ఉన్నట్టు రామచంద్రభారతి చేసిన మెసేజ్లు కాల్డాటాలో బయటపడ్డాయని పోలీసు వర్గాలు వివరించాయి.
సింహయాజికి టికెట్ బుక్ చేసింది బండి సన్నిహితుడు అడ్వకేట్ శ్రీనివాస్
కూల్చివేత కుట్రలో రాష్ట్ర బీజేపీ నేతల్లో ఒకరిద్దరికి పూర్తి ప్రమేయం ఉన్నట్లు మొత్తం తెలుసునని సిట్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడైన అడ్వకేట్ శ్రీనివాస్ అనే వ్యక్తే సెప్టెంబరు 26న సింహయాజికి తిరుపతి నుంచి హైదరాబాద్ టికెట్ బుక్ చేసాడని వారు టికెట్ నంబరుతో సహా పేర్కొన్నాయి. నందు, సింహయాజి, శ్రీనివాస్… ఢిల్లీలో బండి సంజయ్ నివాసంలో అనేకసార్లు కలిసినట్టు కూడా ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు.
ఏపీలో 70 మంది ఎమ్మెల్యేలకు ఎర
ఏపీ సీఎం జగన్తో స్నేహం నటిస్తూనే బీజేపీ ఆయన ప్రభుత్వాన్నీ పడగొట్టడానికి ఎత్తులు వేసింది. ఏ రాష్ట్రంలో ఎంతమందిని బ్రోకర్లు సంప్రదించారనే దానిపై కాల్ డాటాలో వివరాలు లభ్యమై నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ఏపీలో 70 మందిని టార్గెట్ చేస్తే 55 మంది ఆల్రెడీ బ్రోకర్ల సంపర్కంలో ఉన్నారట.
ఏపీ- 70, ఢిల్లీ- 43, రాజస్థాన్- 21
నంబర్ 1 అంటే మోదీ.. నంబర్ 2 అంటే అమిత్షా
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ బ్రోకర్లు వాడిన నంబర్ వన్, నంబర్ టు అంటే ఎవరు? ‘నంబర్ వన్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ. నంబర్ టు అంటే బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్షా’ అని ఏ1 రామచంద్ర భారతి పోలీస్ కస్టడీలో స్పష్టంగా చెప్పారని సిట్ వర్గాలు వివరించాయి. ఆయన చెప్పిన దాన్ని వీడియోలో రికార్డు కూడా చేసినట్టు వెల్లడించాయి.
తెలంగాణను తల్లకిందులు చేసే కుట్రకు దాదాపు ఆరు నెలల క్రితం బీజం పడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హా హైదరాబాద్ వచ్చిన జూలై 2వ తేదీ తొలి మలుపు. అక్టోబర్ 26న ఫామ్హౌస్లో ముగ్గురు బ్రోకర్లు పోలీసులకు పట్టుబడడం కీలక మలుపు. ఈ రెండు మలుపుల మధ్య వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఒక కల్పన. ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభం పేరుతో ప్రధాని హైదరాబాద్ రావడం మరో కల్పన. దాదాపు ఆరు నెలల క్రితం.. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు సంకేతాలిచ్చారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏమీ ఒరగలేదని, ఒక్క పని కూడా జరగలేదని గణాంకాల సాక్షిగా చూపించిన కేసీఆర్, వివిధ రంగాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని దేశ ప్రజల ముందుంచారు. దేశం తప్పుడు మార్గంలో వెళుతున్నదని, ఇప్పటికైనా దిద్దుబాటు జరగాలని పదేపదే డిమాండ్ చేశారు.ఎవరూ స్పందించలేదు. లైట్ తీసుకున్నట్టు నటించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని అనితర సాధ్యంగా అభివృద్ధి చేసిన కేసీఆర్కు దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడింది. అప్పటిదాకా కేసీఆర్పై పెద్దగా విమర్శలు చేయని బీజేపీ కేంద్ర పెద్దలు ఆయన్ను తమ టార్గెట్గా ప్రకటించుకున్నారు.
తర్వాతి కథ ఇలా మొదలైంది.. సీఎం కేసీఆర్ మే 22న పంజాబ్ వెళ్లారు. రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు సాయం అందించారు. ఆగస్టు 31న బీహార్ రాజధాని పాట్నా వెళ్లారు. గల్వాన్లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు చెక్కులు అందించారు. కేసీఆర్ ఇలా తనపనిలో తానుండగా.. ఢిల్లీ పెద్దలు భయపడిపోయారు. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన కీలక పరిణామం జరిగింది. రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్సిన్హా హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ సభా వేదికపైనుంచే ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వ పనితీరును కడిగి పారేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసీఆర్ ప్రశ్నలు జాతీయ చానెళ్లలో, సోషల్మీడియాలో చర్చనీయాంశాలు అయ్యాయి. అప్పటిదాకా పెద్దగా పట్టించుకోనట్టు నటించిన బీజేపీ నాయకత్వానికి, మెల్లగా సీరియస్నెస్ అర్థమైంది. కేసీఆర్ను ఆపకపోతే అది దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యర్థుల ఏకీకరణకు దారితీస్తుందని భయపడ్డారు. అదిగో ఈ భయంలోంచి పుట్టిందే కుట్ర. తెలంగాణలో ప్రభుత్వ కూల్చివేత కుట్ర. ఆ కుట్రకు వారెంచుకున్న ఒక ఎత్తుగడ ఒక ఉప ఎన్నిక! ఉప ఎన్నిక ఒక పాచిక!
ఉప ఎన్నిక ద్వారా వారు ఆశించిన ప్రయోజనాలు రెండు. 1.కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించకుండా కొన్ని నెలల పాటు తెలంగాణకే కట్టడి చేయడం. 2.తదనంతర పన్నాగాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం. ఆ తదనంతర పన్నాగాలేమిటి? 1.ఏదో ఒక సీటుకు ఉప ఎన్నిక తేవడం 2.ఉప ఎన్నికకు పోలింగ్ జరిగేలోపే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడం 3.ఉప ఎన్నికలో ఏదేమైనా, ఆరు నూరైనా, ఆకాశం భూమి ఏకం చేసైనా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం 4.ఆ గెలుపు ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రజామోదం ఉన్నది అని ప్రజల్లో చాటడం 5.ఎమ్మెల్యేల కొనుగోలును, ఉప ఎన్నిక ఫలితాన్ని చూపించి, ఇతర బలమైన నేతలను, మాజీలను ఆకర్షించడం, టీఆర్ఎస్లో చిచ్చుపెట్టడం, ఆ పార్టీ పని అయిపోయిందనే ప్రచారం చేయడం. వీటన్నింటి అంతిమ పర్యవసానం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం! ఇదీ బీజేపీ కేంద్ర పెద్దలు పన్నిన షడ్యంత్రం. ఈ ఆరంచెల కుట్రలో అమాయకంగా చిక్కుకున్న చిన్న పావు అప్పటి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి!
బకరాగా దొరికిన రాజగోపాల్రెడ్డి
తెలంగాణలో ఉప ఎన్నిక ఎలా సృష్టిద్దామా అని బీజేపీ తలలు పట్టుకున్న సమయంలో, ఆ సంగతులేవీ తెలియని రాజగోపాల్రెడ్డి, అమిత్షాను కలిశారు. తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు వెల్లడించారు. దీంతో బీజేపీ పెద్దలు ‘దొరికిండు బకరా’ అన్నట్టు సంబురపడిపోయారు. ‘రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడు’ అని ఆర్డరిచ్చారు. అందుకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును, అదానీని కాదని, ఆశపెట్టారు. నిజానికి రాజీనామా చేయడం రాజగోపాల్రెడ్డి ఉద్దేశం కానే కాదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరితే మహా అయితే స్పీకర్తో అనర్హత వేటు వేయిస్తారు. ఏడాదిలోనే ఎన్నికలున్నాయి. అనర్హతపై కోర్టుకు పోయి ఆ ఏడాది కాలం గడపొచ్చు’ అన్నది ఆయన ఆలోచన. పదవీ ఉంటుంది. బీజేపీలో చేరితే కాంట్రాక్టూ దక్కుతుంది అన్నది ఆయన లెక్క.
అయితే ఆయన ఒకటి తలిస్తే అమిత్షా మరొకటి తలిచారు. ‘రాజీనామా చేస్తే నువ్వు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తావు. ఎన్ని వందల కోట్లు ఖర్చయినా సరే. నిన్ను గెలిపించుకొనే బాధ్యత నాది. ఈ ఎన్నికలో గెలిస్తే నువ్వు రాష్ట్రంలోనే కాదు; దేశంలోనే హీరోవు అవుతావు. బీజేపీలోనూ నీకు ఎదురుండదు’ అని గ్యాస్ కొట్టారు.
అసలు తన బలాన్ని అతిగా ఊహించుకునే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఈ మెరమెచ్చులకు తేలికగా పడిపోయారు. గెలిస్తే తన ఖ్యాతి విశ్వవిఖ్యాతం అవుతుందనే భ్రమలో పడిపోయారు. అమిత్షా చెప్పినట్టు రాజీనామా చేశారు. ‘బకరా’ను బలిపీఠం ఎక్కించిన బీజేపీ పెద్దలు, ఆయన్ను గెలిపించేందుకు మునుగోడులోకి వందల కోట్లు పంప్ చేయడం మొదలుపెట్టారు!
రంగంలోకి ఆర్సీబీ
నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు తెర తీయడానికి పూర్వమే పన్నాగంలోని తదుపరి దశల అమలుకు బీజేపీ పెద్దలు తెరలేపారు. ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరిన దొంగస్వామి రామచంద్రభారతిని రంగంలోకి దించారు. ఆయనకు అప్పటికే తెలంగాణలో కొందరితో పరిచయాలున్నాయి. వారిలో ఒకరు సింహయాజి. ఇద్దరూ కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింహయాజికి నందు దగ్గరివాడు. దీంతో వీళ్లద్దరి ద్వారా రామచంద్రభారతి ఆపరేషన్ కమల్ మొదలుపెట్టారు. బీజేపీలోకి రండి అంటూ పలువురు నాయకులకు, టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు వెళ్లాయి. అయితే వాళ్లు ‘ఛీ.. థూ..’ అని ఉమ్మేశారు. తమను కొనేందుకు ప్రయత్నిస్తే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ఎదురు తిట్టారు. మీ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్లమా? అని తిట్టారు. ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకొస్తూ వచ్చారు.
రోహిత్తో కాంటాక్ట్
అయితే అసెంబ్లీలో 104 మంది సభ్యులున్న తమను బీజేపీ ఏం చేస్తుందని అధిష్ఠానం ధీమాగా ఉన్నది. ఇంతలో అక్టోబర్ 3వ తేదీన ఉప ఎన్నిక షెడ్యూలు రానే వచ్చింది. దీంతో బీజేపీ ఆపరేషన్ కమల్లో వేగం పెంచింది. పోలింగ్కు ముందే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం దాని లక్ష్యం. ఈ క్రమంలోనే బ్రోకర్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో కాంటాక్ట్లోకి వచ్చారు. వెంటనే రోహిత్రెడ్డి ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చారు.
ఇలా, ఇంతమంది పార్టీ ఎమ్మెల్యేల నుంచి పదేపదే సమాచారం వస్తుండటంతో అధిష్ఠానం, ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏదో జరుగుతున్నదని అనుమానించారు. ఈ వ్యవహారం అంతు తేల్చాల్సిందేనని నిర్ణయించుకున్నారు. పోలీసు యంత్రాంగాన్ని, నిఘా సంస్థలను అప్రమత్తం చేశారు.
ఈలోగా రోహిత్రెడ్డి ముగ్గురు బీజేపీ బ్రోకర్లను లైన్లో పెట్టారు. వారితో జరిపిన సంభాషణలు, టెక్స్ మెసేజ్ వంటి ఆధారాలను అధిష్ఠానానికి అందించారు. బ్రోకర్లను ముగ్గులోకి దించడానికి రోహిత్.. ‘మిమ్మల్ని ఎలా నమ్మేది? బీజేపీలో మీకున్న సంబంధాలేమిటి?’ అని ఆరా తీశారు. ఇదే విషయాన్ని రామచంద్రభారతికి సింహయాజి చేరవేశారు. సెప్టెంబర్ 22న సింహయాజికి రామచంద్రభారతి ఇలా మెసేజ్ పంపారు. ‘పీఎం ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్.’ దీనర్థం.. దీనిలో ప్రధానమంత్రి స్వయంగా పాలుపంచుకుంటున్నారని! కాల్డాటాలో ఇదంతా బయటపడినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. ప్రధానితో సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు నలుగురు అధికారులు, కేంద్ర హోంశాఖలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కూడా తనతో నిరంతర సంపర్కంలో ఉన్నట్టు రామచంద్రభారతి చేసిన మెసేజ్లు కాల్డాటాలో బయటపడ్డాయని పోలీసు వర్గాలు వివరించాయి.
రోహిత్ను నమ్మేసిన బీజేపీ బ్రోకర్లు
రోహిత్ తమ పక్షాన్నే ఉన్నాడని నమ్మిన బీజేపీ బ్రోకర్లు ముగ్గురూ, ఎలాగైనా సరే ముగ్గురు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనైనా బీజేపీలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చారు. బడుగు బలహీనవర్గాల వారైతే ఈజీగా దొరుకుతారని కూడా వారు సలహా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ముందే ఇది పూర్తవ్వాలని కూడా వారు సూచించారు. రోహిత్ అలా నానుస్తూ వచ్చారు.చివరికి అక్టోబర్ 16న బ్రోకర్లు రోహిత్కు ఇలా మెసేజ్ చేశారు.
‘టగ్ ఆఫ్ వార్. ప్లీజ్.. కనీసం ఒక్కరినైనా చేర్పించు’ అని పదేపదే అడిగారు. అంటే బ్రోకర్లపై బీజేపీ అధిష్ఠానం ఒత్తిడి అంతలా ఉన్నదన్నమాట.
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి):అక్టోబర్ 31న మునుగోడులో పార్టీ అధ్యక్షుడు నడ్డా జరిపే సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని, తదుపరి పన్నాగాన్ని అమలు చేసేందుకే బ్రోకర్లు ఇలా ఒత్తిడి తెచ్చారు. అయితే పోలీసుల సహకారంతో రోహిత్ అప్పటికే వారికి వల పన్నారు. చివరికి.. అక్టోబర్ 26న రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో బేరసారాల మీటింగ్ జరిగింది. పోలీసు కెమెరాల సాక్షిగా బ్రోకర్ల సంభాషణలు, నగదు ఆఫర్లు, నంబర్-1, నంబర్-2ల పేర్లు, బీఎల్ సంతోష్ ప్రస్తావన అన్నీ బయటపడ్డాయి. నిజానికి ఫామ్హౌస్లో ఆపరేషన్ కమల్ దొంగలను పట్టుకున్న రోజు బీజేపీ టాప్ 2, 3 అమిత్షా, బీఎల్ సంతోష్తోపాటు షాకు సన్నిహితుడైన తుషార్ ఒకే చోట ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్పాయి. అక్కడి నుంచే తుషార్ రామచంద్రభారతితో మాట్లాడారు. మిగతా ఇద్దరు పెద్దలతోనూ మాట్లాడిస్తానని రామచంద్రభారతి వారికి హామీ ఇచ్చారు. ఆ సమయంలో వారు బిజీగా ఉండిపోవడంతో త్రుటిలో అది తప్పిపోయిందని సిట్ వర్గాలు తెలిపాయి.
బీజేపీ పెద్దలతో సన్నిహితంగా బ్రోకర్లు
ముగ్గురు బ్రోకర్లతో తమకు ఏ సంబంధమూ లేదని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ, వారికి కేంద్ర బీజేపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు అనేక ఆధారాలు సూచిస్తున్నాయని పోలీసులు, ఈ అంశాన్ని పరిశోధిస్తున్న నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన వీడియో ఫుటేజీ, కాల్డాటా, లాప్ట్యాప్ డాటాను విశ్లేషిస్తుంటే కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్తున్నారు. ఇదంతా నంబర్ 2 ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగినట్టు అన్ని ఆధారాలూ ఉన్నాయని వారు చెప్పారు.
‘రామచంద్రభారతి ఎంత ఘటికుడంటే.. ఆయన నేరుగాటాప్ 2, 3లకు మెసేజ్ చేయగలడు. వారితో మాట్లాడించగలడు. బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖ నేతలు కూడా పదవుల కోసం రామచంద్రభారతిని సంప్రదిస్తుంటారు. ఉదాహరణకు సాధ్వీ ప్రాచి అనే నాయకురాలు తనకు రాజ్యసభ సీటు ఇప్పించాల్సిందిగా రామచంద్రభారతికి చేసిన మెసేజ్ కూడా బయటపడింది’ అని పోలీసు వర్గాలు వివరించాయి.
ఇది ఆషామాషీ కేసు కాదని జాతీయ స్థాయి పాత్రికేయులు కూడా పేర్కొంటున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతల్లో కూడా ఒకరిద్దరికి ఈ వ్యవహారం మొత్తం తెలుసునని సిట్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడైన అడ్వకేట్ శ్రీనివాస్ అనే వ్యక్తే సెప్టెంబర్ 26న సింహయాజికి తిరుపతి నుంచి హైదరాబాద్ టికెట్ బుక్ చేశాడని వారు టికెట్ నంబరుతో సహా పేర్కొన్నారు. నందు, సింహయాజి, శ్రీనివాస్… ఢిల్లీలో బండి సంజయ్ నివాసంలో అనేకసార్లు కలిసినట్టు కూడా ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఇది మామూలు కుట్ర కాదని, దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్నవారే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే అత్యున్నత న్యాయస్థానం కూడా దీన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నదని, ఇద్దరు జడ్జిలు ఈ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేయడమే దీనికి నిదర్శనమని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.
జరిగింది ఇది..
ఒక (అది మునుగోడు అయింది) ఉప ఎన్నికతో మొదలు పెట్టి, తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతతో ముగిద్దామనుకున్న దారుణం… ముఖ్యమంత్రి కేసీఆర్ చాతుర్యం వల్ల, పోలీసు కెమెరాల సాక్షిగా వీడియోలో రికాైర్డెంది. సెల్ఫోన్ల సాక్షిగా నంబర్ 1, 2, 3 ల బండారం బయటపడింది. ఇది ఇక్కడితో ఆగేది కాదు. అన్ని రాష్ర్టాల్లోలాగే తెలంగాణలోనూ నలుగురైదుగురిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిపించి విషయాన్ని పక్కదోవ పట్టించవచ్చని ఆయన భ్రమ పడ్డారు. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది. ఈ వ్యవహారం దేశం మొత్తాన్నీ పెను తుఫానులా, సునామీలా చుట్టేయడం ఖాయమని ఆయనకు అర్థమైంది. మరోవైపు బీజేపీ నేతలు వందల కోట్లు కుమ్మరించిన ఉప ఎన్నిక ఆఖరుకు వారి చెంప ఛెళ్లుమనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలవైపే మునుగోడు ప్రజలు నిలిచారు. కేసీఆర్పై తమకు అచంచల విశ్వాసం ఉన్నదని చాటారు.
వారి అభిమానంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తానికి రేపటి రాజకీయపు భవితవ్యాన్ని ఈ పరిణామాలన్నీ నిర్దేశించనున్నాయని మోదీకి తెలిసొచ్చింది. ఆ భయంతోనే ‘నేనేమీ భయపడడం లేదు’ అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ప్రధాని మోదీ.. మొన్న తెలంగాణకు వచ్చారు. ఎప్పుడో మొదలైన రామగుండం ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించారు. బండి సంజయ్ ఆదేశిస్తే మోదీ బేగంపేటలో సభ పెట్టాడట. మనం నమ్మాలట! షెడ్యూలులో లేని సభ ఒకదాన్ని బేగంపేటలో పెట్టింది… ‘తో ముకాబ్లా బహుత్ రంగీన్ హోజాయేగా’ అని తెలంగాణకు, టీఆర్ఎస్కు చెప్పడానికే! తెలంగాణ కూడా ఇప్పుడు అటువంటి రసవత్తర పోరుకోసమే, బీజేపీ కూసాలు కదిలించే పోరాటం కోసమే ఎదురుచూస్తున్నది.
సత్యమేవ జయతే!!!