హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల్లో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. ఎఫ్ఆర్పీ రేటు విషయంలో దక్షిణ రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, చెరుకు రికవరీ రేటు 10.25కి పెంచడం వల్ల దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. చెరుకు మద్దతు ధరను రూ.305 నుంచి రూ.350కి పెంచాలని, పంట రుణ వ్యవధిని పొడిగించాలని, షుగర్ కంట్రోల్ చట్టాన్ని సవరించాలని ఎంపీల బృందం కోరింది. కేంద్రమంత్రిని కలిసిన వారిలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులతో పాటు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు, ప్రధాన కార్యదర్శి దైవ శిగామణి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఈ బృందం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్కుమార్ కుభాను కూడా కలిసింది.