Hyderabad | హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ముక్కుపచ్చలారని చిన్నారిని వైద్యం కోసం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యాన మొయిన శేఖర్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. కూతురు ధ్యానమైన నిహారిక (11) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలిపురంలోని హుడా సాయి నగర్ కమాన్ వద్ద ఉన్న తన్వి హాస్పిటల్కు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి సర్జరీ చేసిన వైద్యులు నిహారిక మింగిట 10 రూపాయల కాయిన్ను తొలగించారు. అనంతరం మరుసటి రోజు ఉదయం (శుక్రవారం) 5 గంటల సమయంలో పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత శుక్రవారం సాయంత్రం మళ్లీ నిహారిక అస్వస్థతకు గురైంది. వెంటనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్కు తీసుకువచ్చారు. తన కూతురిని కాపాడాలని హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని వేడుకున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం నిహారికను తిరిగి అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము ఏమి చేయలేమని ఇతర హాస్పిటల్కు తీసుకువెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇంతలోనే పాపం పసి ప్రాణం గాలిలో కలిసిపోయింది.
అనస్తీషియా హైడోస్..
హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని నిహారిక తల్లిదండ్రుల రోదనలు పలువురిని కలిచి వేశాయి. 10 రూపాయల నాణెం తొలగించేందుకు అనుభవం లేని డాక్టర్లు అనస్తేషియా డోస్ ఎక్కువగా ఇవ్వడం వల్లనే చిన్నారి నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన్వి హాస్పిటల్ నిర్వాహకుడు రాము అనే వ్యక్తిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు నిర్వహించి అబార్షన్లు కూడా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిహారిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.