నిజామాబాద్, అక్టోబర్ 2 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జిని తెరిచే క్రమంలో షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన గూడూరు రాజశేఖర్ తన కుటుంబంతో కలిసి నందిపేట్లో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చారు.
సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్తూ మండల కేంద్రంలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్లో సరుకులు తీసుకునేందుకు కూతురు రిషిత(4)ను తీసుకుని వెళ్లాడు. రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా రిషిత ఫ్రిడ్జ్లో చాక్లెట్ తీసుకునేందుకు వెళ్లగా కరెంటు షాక్ తగిలింది. దీన్ని తండ్రి గమనించకపోవడంతో కొన్ని సెకన్ల పాటు చిన్నారి ఫ్రిడ్జికి వేలాడింది.
కొద్దిసేపటి తర్వాత రాజశేఖర్ గమనించి పాపను ఎత్తుకొని మండల కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే పాప మృతి చెందింది. మాల్లో ఉన్న ఫ్రిడ్జికి సాంకేతిక లోపం ఉన్నపటికీ యజమానులు పట్టించుకోకపోవడంతో ఫ్రిడ్జికి కరెంట్ సప్లయి అయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
కరెంట్ షాక్తో పాప మృతి చెందినప్పటికీ మాల్ యజమానులు పట్టించుకోలేదు. తమకేం సంబంధం లేదన్నట్లుగా యథావిధిగా మాల్ను తెరిచి ఉంచారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబీకులు పోస్ట్టుమార్టం అనంతరం పాప మృతదేహాన్ని మాల్ ఎదుట ఉంచి 4 గంటల పాటు రాస్తారోకో చేస్తూ ఆందోళన చేపట్టారు.
స్థానికులు సైతం మద్దతు తెలపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై రాహుల్, తహసీల్దార్ ఆనంద్కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను సముదాయించారు. మాల్ యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.