రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. అతివేగంగా వచ్చిన కారు ఆర్టీసీ బస్ను ఢీకొనడంతో బస్సు చక్రాలు ఊడిపోయి నిలిచిపోయింది. పక్కనే పెద్ద బావి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన వివరాలు.. వేములవాడ రూరల్ మండలం పొశేట్టి పల్లి – నాగయ్య పల్లి గ్రామాల మధ్య బుధవారం ఉదయం ఆర్మూర్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్ వేములవాడ నుంచి ఆర్మూర్కు వెళ్తుంది. కరీంనగర్కు చెందిన ఓ కుటుంబం కారులో కథలాపూర్ నుంచి వేములవాడకు అతివేగంగా వెళ్తూ బస్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు చక్రాలు ఊడిపోయి భారీ శబ్ధంతో కొంతదూరం వరకు వెళ్లి నిలిచిపోయింది. బస్సు నిలిచిన సమీపంలోనే పెద్ద బావి ఉండడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారు బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్న భార్య, భర్తతో పాటు 6 నెలల బాబు,18 నెలల పాపకు స్వల్పగాయాలయ్యాయి.
ఇదే దారిలో వేములవాడకు వెళ్తున్న చందుర్తి సీఐ కిరణ్ కుమార్ తన వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.