ముత్తారం, ఏప్రిల్ 23: చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో.. భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా.. భర్త మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. పారుపల్లికి చెందిన పూసల సంధ్య-మధుసూదన్(43) దంపతులు. వారికి ఉన్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేసేవారు.
వ్యవసాయ భూమి వద్ద నీటి కొరత ఉండటంతో నెల క్రితం రూ.2 లక్షల అప్పు చేసి బోరు వేశారు. ఇతర వ్యవసాయ పెట్టబడుల కోసం రూ.5 లక్షల వరకు అప్పు అయ్యింది. 2022లో కూతురు పెండ్లి కోసం మరో రూ.5 లక్షలు అప్పు తెచ్చారు. మొత్తం రూ.12 లక్షల అప్పు అయ్యింది. దీంతో చేసిన అప్పు తీర్చేమార్గం లేక ఆ దంపతులిద్దరూ ఈ నెల 12న పురుగుల మందు తాగారు.
స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. సంధ్య కోలుకొని ఇంటికి రాగా.. మధుసూదన్ అకడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మధుసూదన్ కుమారుడు ఆకాశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నామని ముత్తారం ఎస్సై మధుసూదన్రావు తెలిపారు.