Doctor | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : వైద్యం చేయాల్సిన ఓ డాక్టర్ డ్రగ్స్ దందాకు దిగాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి డ్రగ్స్ మాయం చేసి హైదరాబాద్లో మత్తుబానిసలకు విక్రయిస్తున్నాడు. ఈ దందాను యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ, హైదరాబాద్ టాస్క్ఫోర్స్, పోలీసుల సాయంతో గుర్తించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఈఎన్టీ సర్జన్ జీ మదన్మోహన్ స్థానికంగా మమత ఈఎన్టీ హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు. దానికి అనుబంధంగా ఉన్న మాన్విత ఫార్మసీకి నార్కొటిక్ డ్రగ్స్ను నిల్వ చేయగలిగే ఎన్పీడీఎస్ లైసెన్స్ ఉన్నది. దీనిని ఓరుగంటి రాజు నిర్వహిస్తున్నాడు.
ఆపరేషన్ థియేటర్లో సర్జరీ సమయంలో వినియోగించాల్సిన నార్కొటిక్, సైకోట్రాపిక్ డ్రగ్స్ను డాక్టర్ మదన్మోహన్ అక్రమంగా మాయం చేసి, వాటిని పార్సిల్ చేసి హైదరాబాద్కు పంపుతున్నట్టు డీసీఏ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు జగిత్యాలలోని అశోక్నగర్లో ఉన్న హాస్పిటల్పై దాడులు చేసి, డాక్టర్ మదన్మోహన్ను విచారించారు. తాను రెండేండ్లుగా హైదరాబాద్ సైనిక్పురిలోని మత్తుబానిసలకు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. హైదరాబాద్ కాచీగూడ పోలీసులు సైనిక్పురిలోని సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలో ఉన్న ఓ ఇంటిలో 11 రకాల డ్రగ్స్ను గుర్తించారు. మరో ఐదు రకాల డ్రగ్స్ను ఇంట్లో వాడినట్టు గుర్తించారు. డాక్టర్ మదన్మోహన్ను అరెస్ట్ చేసిన కాచీగూడ పోలీసులు నార్కొటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫార్మసీ లైసెన్స్ను రద్దు చేయనున్నట్టు డీసీఏ అధికారులు చెప్పారు.