Dalit Bandhu | సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. దళితులను ఆర్థికంగా ఎదిగేలా చేసింది. తలెత్తుకొని బతికేలా చేసింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఓ లబ్దిదారురాలు తిప్పికొట్టింది. ఆనాడు ఇబ్బందుల్లో ఉన్న మాకు ఆ పదివేలు ఎందుకివ్వలేదు ఆ వెధవ అంటూ కాంగ్రెస్ పార్టీని ఆమె కడిగిపారేసింది. దళితబంధు ఇచ్చి ఆదుకున్న నా తండ్రి కేసీఆర్ అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చారు. సూర్యాపేటలో దళిబంధు లబ్దిదారులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్దిదారురాలు చింతలచర్ల రత్నమ్మ ఆవేదనతో మాట్లాడారు.
రత్నమ్మ ఆవేదన ఆమె మాటల్లోనే.. గతంలో 30 సంవత్సరాలు నేను, నా భర్త చెప్పులు కుట్టి బతికాం. డబ్బులు ఉన్నోళ్లకాడ బానిసత్వం చేశాం. ఈ బానిసత్వం నుంచి విముక్తి ఎప్పుడు కలుగతది దేవుడా..? ఏ ప్రభుత్వమైనా సహాయం చేయకపోతారా..? ఏ మంత్రైనా సహాయం చేయకపోతారా..? ముఖ్యమంత్రులున్నరు.. మంత్రులున్నరు. మంత్రి ఎట్ల ఉంటడో కూడా నాకు తెలియదు. ఓటు అడగడమే తప్పా.. వారికి మా బాధలు, కష్టాలు వాళ్లకు తెల్వదు. మాదిగోడు అంటేనే హీనమైన చూపు చూసిన ప్రభుత్వం అది(కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి). ఆ ప్రభుత్వాల్లో కరెంట్కు ఏడ్సినం.. నీళ్లకు ఏడ్సినం. ఇదే బిందెలు పట్టుకొనివచ్చి మున్సిపాలిటీ ఆఫీసుల కాడ ధర్నాలు చేసినం. అయ్యా మాకు పదివేల సహాయం చేయండి.. ఈ బానిసత్వం నుంచి మమ్ముల్ని విముక్తి చేయండని ఎన్నోసార్లు అర్సినం. ఈ కష్టం చేసుకుంటనే నా నలుగురి బిడ్డలను చదివిచ్చిన. నా భర్త తాగి తాగి చనిపోయిండు. నేను చేసిన పని నా బిడ్డలకు పెట్టకు అని చనిపోయేటప్పుడు నా భర్త చెప్పిండు. ఇప్పుడున్న ప్రభుత్వం మనకు చేయదు సహాయం. మన బతుకులు మార్చేందుకు ఏ దేవుడో వస్తే నా బిడ్డల బతుకు మారుతది అని నా భర్త అన్నడు. నా భర్త ఆశయానికి నా పిల్లలను పనికి పెట్టలేదు. రోడ్డు మీద ఎక్కి పని చేస్తుంటే.. ఏ మంత్రి కూడా, ఏ అధికారి కూడా మాకు సహాయం చెయ్యలే. పది రూపాయాల సహాయం చేసినోళ్లు లేరు. ఇప్పుడు ఇల్లు ఇస్తాం. మీకు పన్నెండు లక్షలిస్తాం అంటుండు. అప్పుడు ఆ పదివేలు ఎందుకు ఇవ్వలేదు ఆ వెధవ. ఆ బద్మాష్ ఎందుకివ్వలే మాకు. మాకు సహాయం చేయకుండా చాలా బాధ పెట్టిండ్రు. కేసీఆర్ వచ్చినంక ఒక దళిత కుటుంబానికి పది లక్షల రూపాయాలు ఇవ్వాలన్న ఆలోచన కలిగిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్. కేసీఆర్కు బతికినంత కాలం రుణపడి ఉంటాం. ఈ దళితబంధు సాయంతో చెప్పుల షాపు పెట్టుకుంటా. నా ఇద్దరు కొడుకులకు ఉపాధి కల్పిస్తా. నేను ఒకళ్ల మీద ఆధారపడకుండా బతుకుతా. నాకు సహాయం చేశారు నా తండ్రి కేసీఆర్ అని రత్నమ్మ ఆనందభాష్పాలు రాల్చారు.