Khammam | కారేపల్లి : కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సంసార జీవితం సాగిస్తున్న ఆ దంపతులను విద్యుత్ షాక్ పగబట్టినట్లు కాటేసింది. నిమిషాల వ్యవధిలో ఇద్దరిని బలిగొంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40)లు దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుమార్తె ప్రియాంక జన్మించింది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఉదయం బట్టలు ఉతికిన షమీన ఇంటి ముందున్న ఇనుప తీగ(దండెం)పై ఆరేస్తుండగా.. ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్తో అక్కడికక్కడే పడిపోయింది. అదే సమయంలో వారి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి షమీన కిందపడి ఉండటాన్ని గమనించి ఇంట్లో ఉన్న ఆమె భర్త శ్రీనుకు చెప్పాడు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షమీన అప్పుడప్పుడు స్పృహతప్పి పడిపోతూ ఉండేది. అలాగే పడిపోయిందనుకున్న శ్రీను తన భార్యను లేపేందుకు యత్నించాడు. దీంతో అతడికి కూడా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన శ్రీను స్నేహితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ దంపతులను వెంటనే ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాఖీ పౌర్ణమి రోజు భార్యభర్తలిద్దరూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రాజారాం తెలిపారు.