గాంధారి, నవంబర్ 18: ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడిచేశాడు. వాట్సాప్ గ్రూప్ నుంచి తమను ఎందుకు తొలగించావని ప్రశ్నించిన పాపానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది.
గ్రామస్థుల వివరాల ప్రకారం.. గండివేట్ గ్రామ సమాచారం చేరవేసుకునేందుకు గ్రామస్థులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భీమ్దాస్.. ఈ గ్రూప్ నుంచి శనివారం బీఆర్ఎస్ కార్యకర్తను తొలగించాడు. బీఆర్ఎస్కు చెందిన హైమద్, రజాక్, జావేద్.. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కనిపించిన భీమ్దాస్ను వాట్సాప్ గ్రూప్ నుంచి తమను ఎందుకు తీసేశావని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మాటమాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. భీమ్దాస్ అప్పటికే జేబులో దాచుకున్న కత్తిని తీసి ఆ ముగ్గురిపై దాడిచేశాడు. విచక్షణారహితంగా పొడవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన గ్రామస్థులు క్షతగాత్రులను తొలుత బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఛాతిపై గాయాలైన హైమద్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయనను నిజామాబాద్కు తీసుకెళ్లారు. మిగిలిన ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలించారు. మరోవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన భీమ్దాస్ను అదే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చితకబాదారు. గాయపడిన అతడిని ఎల్లారెడ్డి దవాఖానకు తరలించారు.
ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు హింసను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఈ ఘటనలో మదన్మోహన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ దవాఖానలో బాధితులను పరామర్శించిన ఆయన మదన్మోహన్తోపాటు అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మదన్మోహన్ రౌడీషీటర్లను వెంటేసుకొని తిరుగుతున్నారని బీజేపీ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్రెడ్డి ఆరోపించారు.