న్యూస్ నెట్వర్క్, జూలై 7, నమస్తే తెలంగాణ : కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మోదీ సర్కార్ తీరుపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. అచ్చేదిన్ అంటూ సచ్చేదిన్ తెస్తున్నదని మండిపడ్డాయి. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం రోడ్డెక్కారు. కేంద్రప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. నల్లజెండాలు, ప్లకార్డులు చేబూని, గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాలు ధర్నాలు, ర్యాలీలతో అట్టుడికాయి. సిలిండర్లను గరిటెలతో కొడుతూ, రోడ్లపై కట్టెల పొయ్యిలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఖాళీ సిలిండర్లను ఎత్తుకొని భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘మోదీ దిగిపో.. బై బై మోదీ’, ‘వెంటనే గ్యాస్ ధరను తగ్గించాలి’ ‘సామాన్యుడిపై భారం సరికాదు’ అంటూ నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ నిరసనల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.