Agriculture | హైదరాబాద్, మే 29(నమస్తే తెలంగాణ): గతంలో సాగు నీటి సమస్య కారణంగా వాన పడితే గానీ దుక్కి దున్నే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కథ మారింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో పుష్కలమైన సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వేసవిలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. బోర్లు, బావులు ఊటలు బారుతున్నయి. రైతులు ఎప్పుడనుకుంటే అప్పుడు దుక్కి దున్నుకోవచ్చు. పంట సాగు చేసుకోవచ్చు. కానీ పాత పద్ధతినే అవలంబిస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట కడగండ్ల పాలవుతున్నది. రైతుల కష్టం వానపాలవుతున్నది.
అందుకే రైతుల కష్టాన్ని కడగండ్లు దోచుకోకుండా, అకాల వర్షాల నుంచి పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వానకాలం, యాసంగి సాగు కాలాన్ని నెల రోజులు ముందుకు జరిపేలా ప్రణాళికలు రూపొందించింది. ఏ జిల్లాలో ఎప్పుడు నార్లు పోసుకోవాలి? ఎప్పుడు కోతలు పూర్తి చేయాలి? అనే అంశాలపై ప్రణాళికలు రూపొందించింది. ఆ దిశగా రైతులను సన్నద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రైతులకు ముందస్తు పంట సాగుపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సాధారణంగా రైతులు వానకాలం సాగుకు జులైలో నార్లు పోసి ఆగస్టు వరకు నాట్లు వేస్తుంటారు. డిసెంబర్లో వరి కోత కోస్తారు. యాసంగిలో డిసెంబర్లో నారు పోసి జనవరి, ఫిబ్రవరి వరకు నాట్లు వేస్తారు. దీంతో మే నెలలో కోతలు కోస్తారు. వానకాలం సీజన్లో అక్టోబర్లో, యాసంగి సీజన్లో మార్చి రెండో వారం నుంచి, ఏప్రిల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు వానపాలవుతున్నాయి. చివరికి రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ప్రకృతి విసిరే ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు ఒకే ఒక్క మార్గం సాగు సమయాన్ని నెల ముందుకు జరపడం. ఈ లెక్కన వానకాలం సాగుకు జూన్లో నార్లు పోసుకొని, జులైలో నాట్లు పూర్తి చేయాలి. యాసంగిలో అయితే నవంబర్లో నార్లు పోసుకొని, డిసెంబర్లో నాట్లు పూర్తి చేయాలి. ఈ విధానం అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడం సాధ్యం కాదు కానీ వాటి నుంచి పంటలను రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. రైతులు ముందు జాగ్రత్త పడితే ఆరుగాలం కష్టించి పండించిన పంట ఫలితాన్ని అనుభవించవచ్చు. లేనిపక్షంలో రైతుల శ్రమ కడగండ్ల పాలవుతుంది. రాష్ట్రంలో గతంలో మాదిరిగా కరువు పరిస్థితులు లేవు. పుష్కలమైన సాగు నీళ్లు ఉన్నాయి. పెట్టుబడి కోసం వెదుకులాట లేదు. సీజన్కు ముందే రైతులకు ప్రభుత్వం రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఇప్పుడు ఎరువులు, విత్తనాల కొరత లేదు. సీజన్కు ముందే అవన్నీ సిద్ధం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
కోతల ప్రారంభానికి ముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నప్పటికీ అకాల వర్షాలు రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటలను అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు ముందుకు రావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునే అవకాశం రైతుల చేతుల్లోనే ఉన్నదని చెప్తున్నారు. ప్రభుత్వం సూచించినట్టుగా సాగును నెల ముందుగానే ప్రారంభించాలని కోరుతున్నారు.
యాసంగి కోసం నవంబర్ 20లోపు నార్లు పోసుకోవాలి. అయితే వానకాలం వరి కోతలు నవంబర్ మొదటి వారంలోపు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యాసంగి వరి నారు కోసం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో వానకాలం సాగు సమయంలోనే రైతులు ముందు జాగ్రత్తగా యాసంగి నారు కోసం ఒక చిన్న మడిని వదిలేసుకుంటే బాగుంటుంది. దీంతో వానకాలం వరి కోతలు కాస్త ఆలస్యమైనప్పటికీ వదిలేసిన మడిలో యాసంగి కోసం సరైన సమయంలో నారు పోసుకునే వీలుంటుంది.