TS SSC Exams |హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి. ప్రధాన సైన్స్ పరీక్షలో అంతర్భాగమైన భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆరు పేపర్లకు ఏడు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. రెండేండ్ల క్రితం పదో తరగతి పరీక్షా పేపర్లను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించారు. అయితే సైన్స్లో జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్ర్తాలను వేర్వేరు సబ్జెక్టులున్నాయి.
ఈ రెండింటిని ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు. అన్ని సబ్జెక్ట్లకు ఒకే సమాధాన పత్రాన్ని ఇవ్వనుండగా, ఒక్క సైన్స్ పేపర్కు మాత్రం రెండు ప్రశ్నపత్రాలు, రెండు జవాబు పత్రాలిస్తున్నారు. జీవశాస్త్రం, భౌతికరసాయనశాస్ర్తాల ఉపాధ్యాయులిద్దరు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. 40 మార్కులకు భౌతిక, మరో 40 మార్కులకు జీవశాస్త్రం పేపర్లకు పరీక్షను ఒకే రోజు నిర్వహించడంతో విద్యార్థులు సరిగ్గా సన్నద్ధంకాలేకపోతున్నారు. దీంతో సైన్స్ పేపర్లకు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలన్న విజ్ఞప్తులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు 5.03 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఒక పూట ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు పూటలా ప్రత్యేక తరగతులుంటాయి.