Telangana | తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. కన్నుమిన్ను కానక కండకావరం చూపుతున్నారు. దళితులపై ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి అండ చూసుకుని గ్రామాల్లో చిన్న చిన్న నాయకులు సైతం చెలరేగిపోతున్నారని విపక్షాలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దళితులైన తండ్రీకొడుకులపై కాంగ్రెస్ జడ్పీటీసీ భర్త కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు దిగితే.. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త కార్మికులపై కర్రలతో దాడి చేశాడు.
మెట్పల్లి, మార్చి 20: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో దళిత కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకుపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, స్థానిక జడ్పీటీసీ రాధ భర్త కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి దౌర్జన్యానికి దిగాడు. దళితుడైన గొర్రె రంజిత్, అతని తండ్రి మల్లేశంను కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడటం స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపూర్లోని మల్లన్నస్వామి ఆలయ సమీపంలో హోటల్ వద్దకు టీ తాగేందుకు రంజిత్ వెళ్లాడు. అదే సమయంలో అక్కడ మల్లన్నస్వామి ఆలయ ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మ్యాదరి కార్తీక్ తన ట్రాక్టర్తో చేయించిన పనులకు సంబంధించి డబ్బుల విషయమై ఆలయ కమిటీ చైర్మన్ ముదాం రమేశ్ను అడుగుతున్నాడు. రమేశ్ కార్తీక్తో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రంజిత్కు చెబుతుండగా.. అక్కడికి వచ్చిన శ్రీనివాస్రెడ్డి కల్పించుకుని కులం పేరుపెట్టి పరుష పదజాలంతో దూషిస్తూ రంజిత్పై చెప్పుతో దాడి చేశాడు. దీంతో రంజిత్ తన తండ్రి మల్లేశంతో కలిసి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కోరుట్లకు వెళ్లాడు. తిరిగి గ్రామానికి వచ్చాక తమ వెంబడి వచ్చిన మరొకరిని ఇంటివద్ద దింపేందుకు మోటర్ సైకిల్ వెళ్తున్న మల్లేశంను శ్రీనివాస్రెడ్డి, అతని కొడుకు శ్రీకర్, తల్లి రామవ్వ అడ్డుకున్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తారా? అంటూ విచక్షణ కోల్పోయి దాడికి దిగారు. ఈ ఘటనలో మల్లేశం తల పగలడంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు బాధితులకు అండగా నిలిచారు.
జడ్పీటీసీ భర్త శ్రీనివాస్రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి బాధితులను పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో కలిసి వారు స్వయంగా మెట్పల్లి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, నిందితులను శిక్షించాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మనుషుల పేగులు మెడలో వేసుకుని తిరుగుతా, పండబెట్టి తొక్కుతా’ అని వాళ్ల నాయకుడు రేవంత్రెడ్డి అంటే.. అదే బాటలో వాళ్ల కార్యకర్తలు నడుస్తున్నారని విమర్శించారు.
దాడుల సంస్కృతి మంచిది కాదని, పదవులు, అధికారం శాశ్వతం కాదు అనే విషయం గ్రహించాలని హితవు పలికారు. సీఎం రేవంత్రెడ్డి కుల అహంకారాన్ని తగ్గించుకుని అణగారిన వర్గాలకు రక్షణ కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై, ప్రజలపై దాడులను సహించేది లేదని తేల్చి చెప్పారు. దళిత బిడ్డలపై దాడులకు తెగబడటం హేయమైన చర్య అని, పెద్దాపూర్ఘటను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్, అంబేద్కర్ సంఘాల నాయకులు నిలిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు జడ్పీటీసీ భర్తపై కేసు నమోదు చేసినట్టు కోరుట్ల ఎస్సై కిరణ్ తెలిపారు. కాగా మెట్పల్లిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 20 : మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ బల్దియాలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. మహబూబ్నగర్ మున్సిపాలిటీ 17వ వార్డులోని ఎర్రవెల్లి తండాలో ఎల్ఈడీ లైట్లను వేసేందుకు కార్మికులు మోసిన్, చిన్నా వెళ్లారు. అయితే, చాలా రోజులుగా లైట్లు ఎందుకు వేయలేదని కాలనీవాసులు కార్మికులను అడగగా.. మున్సిపాలిటీ నుంచి వస్తేనే తాము వేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కాలనీవాసులు కౌన్సిలర్కు చెప్పగా.. కాంగ్రెస్ కౌన్సిలర్ జంగమ్మ భర్త పాపారాయుడు ఆవేశంగా వచ్చి కార్మికులను అసభ్య పదజాలంతో దూషిస్తూ కార్మికులపై కర్రలతో దాడిచేశారు. గాయాల పాలైన కార్మికులు రూరల్ ఎస్సై విజయ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం క్షతగాత్రులను పోలీసులు ప్రభుత్వ జిల్లా దవాఖానకు చికిత్స కోసం తరలించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ భర్తపై కేసు నమోదు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.