మక్తల్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలపై పోలీసులు కేసులు ( Police Case ) నమోదు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) ఆదివారం ఉదయం మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం టి రోడ్డు వద్ద మక్తల్ , మాగనూర్, కృష్ణ బీఆర్ఎస్ నాయకులతో జాతీయ రహదారి పై శాంతియుతంగా రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై కృష్ణ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు.
ప్రశ్నిస్తే కేసులు చేయడం వెన్నతో పెట్టిన విద్యా : మాజీ ఎమ్మెల్యే చిట్టెం
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వారిపై, కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తే మాగనూరు పోలీస్ స్టేషన్లో రైతులతోపాటు నాయకులపై మంత్రి వాకిటి శ్రీవారి కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు.