ఆదిలాబాద్ : మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వివాహ పనుల్లో నిమగ్నమైన వరుడు గుండెపోటుతో పెళ్లి పందిట్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూరుకు చెందిన రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సత్యనారాయణచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సత్యనారాయణచారి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరుడు కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పెళ్లి కుమారుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.