హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యం కోసం అయితే ఉపాధి హామీని ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. కూలీలకు పని కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ పథకాన్ని.. పనులకు రావాలంటేనే భయపడేలా మార్చుతున్నది. పనిచేస్తే డబ్బులు వస్తాయో, రావోనన్న ఆందోళన కూలీల్లో నెలకొన్నది. తనిఖీలు, నిబంధనల పేరుతో తమ కూలీ డబ్బులకు ఎక్కడ గండి కొడతారోనని భయపడుతున్నారు.
తెలంగాణపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనిఖీల పేరుతో కేంద్రం చేస్తున్న హంగామా ప్రభావం ఉపాధి హామీ కూలీల పనిదినాలపై పడింది. గత రెండు నెలలుగా కూలీలు పనులకు రావాలంటే జంకుతున్నారు. గత ఏడాది ఆగస్టు 20న రాష్ట్రంలో మొత్తం 1.81 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేశారు. కానీ, 2022 ఆగస్టు 20న 41,384 మంది మాత్రమే పనికి వచ్చారు. జూలైలో కూలీల పనిదినాలు 40 లక్షలు మాత్రమే. జూలై, ఆగస్టు పనిదినాలను గత ఏడేండ్లతో పోల్చి చూస్తే ఏనాడూ ఇంత తక్కువ పని చేయలేదు.
దేశంలో ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొన్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు పొందింది. అయితే కేంద్రం మాత్రం తెలంగాణపై కన్ను కుట్టినట్టుగా వ్యవహరిస్తున్నది. ఉపాధి హామీ పనులపై తనిఖీల పేరుతో హంగామా చేస్తున్నది. ఒకే సారి 15 బృందాలను రాష్ర్టానికి పంపింది. అంతకు ముందు నెలలో 5 బృందాలు రాష్ర్టానికి వచ్చి తనిఖీలు చేశాయి.
కేంద్రం బృందాల తనిఖీతో ఉపాధి హామీ అధికారులంతా ఆ బృందాల తనిఖీలకు అవసరమైన సమాచారాన్ని అందించటంలోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. తనిఖీల వల్ల.. తమకు కూలీ వస్తుందో, రాదోనని కూలీలు కూడా భయపడుతున్నారు. పనిచేశాక డబ్బు ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటని.. పనికి కూడా రావటం లేదు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా పని దినాలు తగ్గాయి.