వాటిలో 70 ఎంఎంటీఎస్, 28 ప్యాసింజర్ రైళ్లు
19 రైళ్లు పాక్షికంగా రద్దు.. మరో 8 దారి మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో వెల్లడి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లో చోటుచేసుకొన్న అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో 98 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందులో 70 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, 28 రెగ్యులర్ రైళ్లు ఉన్నట్టు వెల్లడించారు. 19 రైళ్లను పాక్షికంగా రద్దు చేసి, మరో 8 రైళ్లను దారి మళ్లించామని దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో రాకేశ్ వివరించారు. సికింద్రాబాద్ ఆందోళనల నేపథ్యంలో ఉత్తర మధ్య రైల్వే జోన్ పరిధిలోనూ పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.
ఎక్కడికక్కడే రైళ్లు నిలిపివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కు రావాల్సిన పలు రైళ్లను నగర శివారులోని మౌలాలి, చర్లపల్లి వంటి స్టేషన్లలో నిలిపివేశారు. ఆయా రైళ్లలోని ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. పలు రైళ్లను కాజీపేట్, వరంగల్ స్టేషన్లలోనూ నిలిపివేశారు. రద్దు చేసిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకొన్న ప్రయాణికులకు టికెట్ చార్జీ పూర్తిగా వాపస్ ఇస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.