జూనియర్ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు
రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువులకు రిజర్వేషన్
ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్
చర్యలపై 23లోగా నివేదిక పంపాలని ఆదేశం
ఈ నిర్ణయంతో నిరుద్యోగ యువతకు మేలు
స్వాగతిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అన్నిరకాల సంస్థల్లో రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని శాఖల కార్యదర్శులకు శనివారం ఆదేశాలు జారీచేశారు. 2018 రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ మొదలుకుని డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. అదే తరహాలో అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ స్థానిక రిజర్వేషన్లు అమలుచేయాలని ఆయా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్నిశాఖల కార్యదర్శులకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు జారీచేశారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టి, ఈ నెల 23వ తేదీలోగా సాధారణ పరిపాలనశాఖకు నివేదికలు పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలోని బేవరేజెస్, సివిల్ సప్లయీస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, గిడ్డంగుల సంస్థ వంటి కార్పొరేషన్లు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ ఎడ్యుకేషనల్ సొసైటీల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.
సమాన ఫలాలు అందాలనే..
స్వరాష్ట్రంలో పౌరులంతా సమాన ఫలాలను అందుకోవాలన్న ఆకాంక్షతోనే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కేలా చట్టంలో మార్పులు చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అన్యాయానికి, వివక్షకు తావుండొద్దని, హైదరాబాద్, సహా పట్టణప్రాంతాల్లోని వారు ఉద్యోగాలు ఎగరేసుకుపోతారన్న భావన గ్రామీణ ప్రాంతాల వారికి ఉండొద్దన్న ఆలోచనతోనే కొత్త జోనల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మారుమూల ములుగు జిల్లాలోని అభ్యర్థులు, కాస్మొపాలిటన్ నగరమైన హైదరాబాద్లోని అభ్యర్థులు ఒకే సామర్థ్యాలు కలిగి ఉండరని, ఇది మళ్లీ అసమానతలకు దారితీసే అవకాశముందని భావించిన సర్కారు స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ ను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా విభజించింది. దీంతో ఏ జిల్లాలోని స్థానికులు ఆయా జిల్లాలోనే ఉద్యోగాలు దక్కించుకొనేలా మార్గదర్శకాలిచ్చింది. దీనికి కొనసాగింపుగా తాజాగా ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లోను 95శాతం స్థానిక కోటాను వర్తింపజేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతిస్తున్నారు. దీని వల్ల నిరుద్యోగ యువతకు మేలు కలుగుతుందంటున్నారు.
95% రిజర్వేషన్లు అమలయ్యేవి..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు జరుగుతుంది
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లకు గండికొడుతున్నది. తెలంగాణ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకొంటూ, రిజర్వేషన్లను కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అన్ని ఉద్యోగాల్లో 95 శాతం కోటాలను అమలుచేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు మేలుకలుగుతుంది. ఇది పేద, బలహీనవర్గాలపై కేసీఆర్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
– దేవీప్రసాద్రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు