హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఏడేండ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. దీంతో 2023-24 సీజన్కు రెట్టించిన ఉత్సాహంతో చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. రూ.82.35 కోట్ల ఖర్చుతో 85.60 కోట్ల చేపపిల్లలను, రూ.24.60 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేల నీటి వనరులను గుర్తించింది. నిరుడు రూ.86 కోట్లతో 85 కోట్ల రొయ్య, చేపపిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈసారి మొత్తంగా 107 కోట్లు ఖర్చు చేయనున్నది. దీంతో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.487 కోట్లకు చేరనున్నది. మత్స్యకారుల అభివృద్ధి కోసం దేశంలోని మరే ఇతర రాష్ర్టాల్లోనూ ఇంత భారీ మొత్నాన్ని ఖర్చు చేయకపోవడం గమనార్హం.
టెండర్ల దాఖలుకు 31 వరకు గడువు
ఈ ఏడాది చేప, రొయ్య పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. టెండర్లకు ఆసక్తి చూపేవారితో 16న ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే జూలైలో చేప పిల్లల పంపిణీకి అధికారులు ప్రణాళిక రూపొందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.