హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ రెండోభాష పరీక్ష నిర్వహించారు. తొలిరోజు 95.3 శాతం విద్యార్థులు హాజరుకాగా, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్పడటంతో డిబార్చేశారు. నిమిషం నిబంధన కారణంగా నిజామాబాద్, వేములవాడల్లో 20 మంది పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. ఇంటర్బోర్డు అధికారులు 10 జిల్లాలకు పరిశీలకులను పంపించారు. బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ బషీర్బాగ్లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ, మలక్పేటలోని ముంతాజ్, నారాయణగూడలోని రెహనా జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజీలో నీటి వసతి ఏర్పాటుచేయకపోవడంతో చీఫ్ సూపరింటెంట్ దుర్గను విధుల నుంచి తప్పించి, ఈ స్థానంలో సాబేర్ను సీఎస్డీవోగా నియమించారు.
నేటి నుంచి సెకండియర్ పరీక్షలు
శనివారం నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సెకండ్ లాంగ్వేజ్-2 (తెలుగు, సంస్కృ తం) పేపర్కు పరీక్ష నిర్వహిస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. సంస్కృతం పేపర్తో మూల్యాంకనం ప్రారంభమవుతుంది. గతంలో 12 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలుండగా, ఈ ఏడాది నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ ఏర్పాటుచేశారు.
విద్యార్థుల హాజరు వివరాలు..
మొత్తం విద్యార్థులు: 4,64,756
పరీక్షకు హాజరైన వారు : 4,42,546
హాజరుకాని వారు : 22,210
మాల్ ప్రాక్టీస్ కేసు : 1