భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 27: భూపాలపల్లి(Bhupalapalli) సింగరేణి(Singareni elections) ఏరియాలో బుధవారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 వరకు కొనసాగింది. భూపాలపల్లి ఏరియాలో పనిచేస్తున్న మొత్తం 5410 కార్మికుల కోసం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే కార్మికులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ముగిసే వరకు 5123(94.7% ) మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేటీకే -5 ఇైంక్లెన్ పోలింగ్ కేంద్రంలోకి సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు రెడ్ టీషర్ట్లు ధరించి వెళ్తుండగా పోలీసులు, ఐఎన్టీయూసీ నాయకులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. కేటీకే -2 ఇైంక్లెన్ పోలింగ్ కేంద్రంలోకి ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని వెళ్లగా పోలీస్ అధికారులు వారిని అడ్డుకోగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఐదుగురు బృందం ఎన్నికల సరళిని పర్యవేక్షించింది. అనంతరం 9 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్ కు తరలించారు. సాయంత్రం 7 గంటలకు అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. 5 టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించి అర్ధరాత్రి వరకు ఫలితాలు తెలుపనున్నారు.