ఒకప్పుడు ఎంత ఎక్కువ భూమి ఉంటే అంతగొప్ప.. ఊర్లో మోతుబరి రైతు అని చెప్పుకోవడం నాడు ఒక స్టేటస్. పొలమంతా కుటుంబ పెద్ద పేరుమీదే ఉండేది. కొడుకులు వేరు పడితేనో.. కూతురు పెండ్లయితేనో మాత్రమే రిజిస్ట్రేషన్లు మారేవి. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా పథకాలతో నేడు ఆ విధానంలో మార్పు కనిపిస్తున్నది. కుటుంబ సభ్యులందరి పేర్లమీద ఎంతో కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. కూతురు, కొడుకు అనే తేడాలేకుండా పట్టాదారులను చేస్తున్నారు. ఈ మార్పునకు కారణం ‘భూమి భద్రతకు భరోసా నివ్వడం.. గుంట పొలం కూడా గుండె ధైర్యం నింపడం.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భూమి పాత్ర మారింది. గతంలో రైతులు పంట పండించుకునేందుకే పరిమితం కాగా.. నేడు అతడి కుటుంబానికి భద్రతనిస్తున్నది. పేరుమీద గుంటభూమి ఉన్నా గుండె ధైర్యా న్ని నింపుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాల కారణంగా భూములు భద్రతకు భరోసాగా మారాయి. రైతుకు, అత డి కుటుంబానికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. గుంట భూమి రిజిస్ట్రేషన్ ఉన్నా ఈ పథకాలు వర్తిస్తుండటంతో కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ఎంతోకొంత బదలాయించుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ లో పట్టాదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అన్నదాత ఏదైనా కారణంతో మరణిస్తే అతడి కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షల సాయం అందుతున్నది. పెద్ద దిక్కును కోల్పోయిన బాధను తీర్చలేకపోయినా.. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండ గా నిలుస్తున్నది. రైతుబంధు కూడా రైతులను పెట్టుబడి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నది.
59 లక్షలకు పట్టాదారులు
రైతుబంధు, రైతుబీమా పథకాలతో భూమి.. భద్రతకు మారుపేరుగా మారడంతో ప్రతి ఒక్కరూ తమ పేరుపై ఎంతో కొంత భూమి ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే భూమి బదలాయింపు జరుగుతున్నది. కుటుంబంలో అందరి పేరు మీద ఎంతో కొంత భూమి బదిలీ అయింది. దీంతో గత మూడేండ్లలోనే రాష్ట్రంలో 9 లక్షల మంది కొత్త పట్టాదారులు పెరిగారు. 2018-19లో 50.3 లక్షల మంది పట్టాదారులు ఉండగా 2019-20లో ఆ సంఖ్య 51.6 లక్షలకు, 2020-21లో 59.3 లక్షలకు పెరిగింది. వారసుల మధ్య రైతుబంధు డబ్బుల విషయంలోనూ ఘర్షణలు లేకుండా చేస్తున్నది.
సన్న, చిన్నకారు రైతులే అధికం
రాష్ట్రంలో 59.3 లక్షల మంది పట్టాదారులు ఉండగా.. వీరిలో సన్న, చిన్నకారు రైతులే అధికం. 92.54% మందికి ఐదెకరాల్లోపే భూమి ఉన్నది. ఎనిమిదెకరాలు మించి ఉన్నవారు 1% లోపు మాత్రమే ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాక 2.5 ఎకరాల కన్నా తక్కువ భూమి గల రైతులు భారీగా పెరిగారు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18.69 లక్షలు, రెండెకరాలు ఉన్న రైతులు 14.69 లక్షలు ఉండగా.. మూడెకరాలు ఉన్న రైతులు 42.34 లక్షల మంది ఉన్నారు.
భూమిని బదలాయించుకుంటున్నారు
రైతుబంధు, రైతుబీమా పథకాల అమలు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి. కుటుంబంలో ప్రతిఒక్కరి పేరుపై ఎంతో కొంత భూమి ఉండేలా చేసుకుంటున్నారు. దీంతో భూమిని బదలాయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మాకున్న భూమి అంతా గతంలోనా పేరుపైనే ఉండేది. కుటుంబంలో అందరి పేరుపై భూమి ఉండాలనే ఉద్దేశంతో నా కొడుకులు, కూతురు పేరుపై రిజిస్ట్రేషన్ చేయించా. దీంతో మా అందరికీ రైతుబీమా వర్తిస్తున్నది.