హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం మీడియాకు వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతూ.. ఫలానా సంస్థలో పెట్టుబడి పెట్టాలని, భారీగా లాభాలు వస్తాయని లేదా వర్క్ ఫ్రం హోం ద్వారా గంటకు ఐదువేలు సంపాదించవచ్చని ఆశ చూపుతూ కొందరిని లోబరచుకుంటాయి. వారికి లాగ్జామ్ వంటి కొన్ని యాప్స్ పంపి వాటి ద్వారా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తాయి. అలా వచ్చిన సొమ్మును స్థానికంగా ఉండే తమ ఏజెంట్ల సాయంతో బ్యాంక్ ఖాతాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నాయని కమిషనర్ వివరించారు.
తాము అరెస్టు చేసిన వారిలో తైవాన్కు చెందిన చెచువాన్, చైనాకు చెందిన లెక్ అలియాస్ లి ఝువాంజు మరో ఎనిమిది ఉన్నారని తెలిపారు. వీరిని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఈ ముఠా కంబోడియా అడ్డాగా పనిచేస్తున్నదని, చైనీయుల భాగస్వామ్యమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. చైనీయులు భారత్లో రహస్యంగా తమ నెట్వర్క్ను నిర్వహిస్తూ భారీ ఎత్తున మన దేశ సంపదను కొల్లగొడుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ భారీ మోసాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారని ఆయన వెల్లడించారు. ఈ కుంభకోణం దర్యాప్తులో ఈడీ, డీఆర్ఐలను భాగస్వాములను చేస్తామని తెలిపారు. ఓ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై చేసిన దర్యాప్తులో రూ.903 కోట్ల స్కామ్ బయటపడిందన్నారు.