హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారతను మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు రికార్డు స్థాయిలో రుణాలు అందిస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటితో పోలిస్తే రుణాలను ఐదింతలు పెంచింది. తొమ్మిది సంవత్సరాల్లో మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.85 వేల కోట్ల రుణాలను అందించింది. రుణాలు ఇప్పించడమే కాదు వాటి వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీని కోసం రూ.3,681 కోట్లను చెల్లించింది. మహిళలకు ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం సమన్వయం చేస్తున్నది. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం ద్వారా ఆ కుటుంబ ఇబ్బందులు తొలగుతాయనే ఉద్దేశంతో మహిళా స్వయం సహాయకసంఘాలకు రుణాలు అందిస్తున్నారు.
ఐదింతలు పెరిగిన రుణాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 71,749.30 కోట్ల రుణాలను మహిళా స్వ యం సహాయక సంఘాలకు అందించారు. పట్ట ణ ప్రాంతాల్లో రూ.13,178.58 కోట్ల రుణాలను అందించారు. తాజాగా మరో రూ.750 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటికి మహిళా సంఘాలకు కేవలం రూ.3 వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చేవారు. కానీ సీఎం కేసీఆర్ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించటంతో, రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల్లో రుణాలు ఐదింతలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 4.37 లక్షల మహిళా స్వయంసహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 46.46 లక్షల మంది సభ్యులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1.77 లక్షలకు పైగా స్వయంసహాయక సంఘాలు ఉండగా ఇందులో దాదాపు 18 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
ఎన్పీఏలు రెండు శాతమే
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రుణాలను ఇంటి అవసరాలకు, పిల్లల చదవులకు వినియోగిస్తున్నారని గుర్తించి రుణాన్ని వ్యాపారం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్లు, ఎక్కువ వడ్డీ తో రుణం ఇచ్చే ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు చిట్ఫండ్ సంస్థల ద్వారా రుణం తీసుకోవాల్సిన అవసరం లేకుండా కావాల్సిన రుణా న్ని బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్హెచ్జీలకు ఇచ్చే రుణాల్లో రెండు శాతం లోపే ఎన్పీఏలు ఉంటున్నాయి. దీంతో ఎంత మొ త్తం అడిగినా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. సంఘాల్లోని సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి. ఆయా రుణాలను ఉత్పాదక రంగాలపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. పాడిపరిశ్రమ, కుల వృత్తులు, వ్యాపారాల కోసం రుణాలు తీసుకుంటున్నారు.